పైసా ఇవ్వని అమెరికా.. ఇరాన్ డీల్‌లో మెగా ట్విస్ట్ | Iran US Peace Talks Expand Into Mega Deal Combining Nuclear Agreement, Hormuz Security And Massive Investment Package | Sakshi
Sakshi News home page

పైసా ఇవ్వని అమెరికా.. ఇరాన్ డీల్‌లో మెగా ట్విస్ట్

Jun 17 2026 11:01 AM | Updated on Jun 17 2026 12:24 PM

Iran deal features Mega fund more than half already pledged

ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు దేని కోసం అన్న ప్రశ్నకు అణు ఒప్పందం, హర్ముజ్ జలసంధి వంటి అంశాల చుట్టూ భిన్న భిన్న వెర్షన్లు వినిపిస్తున్నాయి. డీల్‌లో అసలు ఏముంది అన్నదానిపై స్పష్టత లేకపోయినా, ఒక్కో వర్గం ఒక్కో కోణాన్ని ప్రధానంగా చూపిస్తోంది. ఇక ఈ మొత్తం సమీకరణాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తున్న పదం మాత్రం ఇప్పుడు చర్చల్లో బలంగా వినిపిస్తోంది… అదే మెగా డీల్.

ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు కేవలం రాజకీయ ఒప్పందాలకే పరిమితం కావడం లేదు. అణు కార్యక్రమంపై నియంత్రణలు, ఆంక్షల ఎత్తివేత, అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి అంశాలు ఈ డీల్‌లో ప్రధాన భాగాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలు భౌగోళిక రాజకీయాల కోణంలో అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి. హర్ముజ్ జలసంధి విషయానికి వస్తే, ఇది ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అత్యంత కీలక మార్గం. ఈ మార్గంపై స్థిరత్వం లేకపోతే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు నేరుగా ప్రభావితమవుతాయి. అందుకే శాంతి ఒప్పందంలో దీనిపై ప్రత్యేక అంగీకారాలు అవసరమవుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం కూడా ఈ చర్చల కేంద్రబిందువుగా కొనసాగుతోంది.

అయితే ఈ రెండు కీలక అంశాల మధ్య ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఆర్థిక ప్యాకేజీ. సుమారు 300 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మొత్తం ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇరాన్‌-యూఎస్‌ పీస్‌ ఫ్రేమ్‌ వర్క్‌ అగ్రిమెంట్‌లో భాగంగా ప్రతిపాదించిన ఈ ఫండ్.. యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం రూపొందించిన భారీ ఆర్థిక ప్యాకేజీగా భావిస్తున్నారు.

రాయిటర్స్‌ కథనం ప్రకారం.. ఈ ఫండ్ పూర్తిగా ప్రైవేట్ పెట్టుబడులతోనే నడుస్తుంది. అమెరికా ప్రభుత్వం నుంచి పైసా సాయం ఉండదు. అయితే.. ఇప్పటికే సుమారు 150 బిలియన్‌ డాలర్లకు పైగా కమిట్‌మెంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. 

ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడమట. ఎనర్జీ, రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడం ద్వారా దేశాన్ని మళ్లీ గ్లోబల్ ఎకానమీకి కలపడం దీని ఉద్దేశమని ఆ కథనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ఆర్థిక ప్యాకేజీని అణు ఒప్పంద చర్చలు, అలాగే హర్ముజ్ జలసంధి అంశం నుండి వేరుగా ఉంచినట్లు సమాచారం. అంటే ఒక వైపు రాజకీయ భద్రతా ఒప్పందాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ ఫండ్ పూర్తిగా ఆర్థిక ట్రాక్‌లో ముందుకు వెళ్లనుందన్నమాట.

ఇరాన్ మొదట యుద్ధ నష్టాలకు 400 బిలియన్ డాలర్ల పరిహారం కోరినప్పటికీ.. అమెరికా ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రత్యామ్నాయంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ఆలోచన ముందుకు వచ్చింది. ఈ మార్పే ఇప్పుడు ఈ డీల్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోందనే విశ్లేషణ నడుస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. హర్ముజ్ జలసంధి భద్రత, అణు ఒప్పందం రాజకీయ స్థిరత్వాన్ని నిర్ణయిస్తే… ఈ 300 బిలియన్ డాలర్ల ఫండ్ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. అంటే ఒకవైపు వ్యూహాత్మక భద్రత, మరోవైపు ఆర్థిక జాక్‌పాట్ – రెండూ ఈ డీల్‌ను నడిపిస్తున్న రెండు ఇంజిన్లలా భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement