
న్యూఢిల్లీ: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. ఇంతలో ఇరాన్ నుంచి ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ.. ఒకవేళ తాను హత్యకు గురైతే తన స్థానంలో ‘ఈ ముగ్గురు’ సీనియర్ మతాధికారులలో ఒకరిని చీఫ్గా ప్రకటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.
ఇప్పటికే రహస్య బంకర్లో తలదాచుకున్న ఖమేనీ, తనను కనుక్కోవడం మరింత కష్టతరం చేయడానికి తన చుట్టూ ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను మూసివేయాలని అధికారులను ఆదేశించాడని ఆ వార్తాపత్రిక నివేదించింది. అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా.. ఇతను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కు సన్నిహితుడైన మతాధికారి. ఈయన సుప్రీం చీఫ్ రేసులో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతను ఖమేనీ పేర్కొన్న అభ్యర్థుల జాబితాలో లేడని, ఆయన పేర్కొన్న పేర్లలో మరో ముగ్గురు ఉన్నారని అధికారులు తెలిపారు.
శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.. ఇరాన్ సుప్రీం లీడర్ను ఇకపై ఉనికిలో ఉంచే ప్రసక్తే లేదు అని పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి టెల్ అవీవ్ సమీపంలోని పట్టణంలోని ఒక ఆసుపత్రిని ఢీకొట్టిన అనంతరం కాట్జ్ ఈ వ్యాఖ్య చేశారు. ‘ఇరానియన్ నియంత రహస్య బంకర్లో కూర్చుని ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, నివాస భవనాలపై క్షిపణులను ప్రయోగిస్తున్నాడు. ఇది తీవ్రమైన యుద్ధ నేరం. వీటికి ఖమేనీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కాట్జ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇరానియన్ సుప్రీంను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్కు ఎదురవుతున్న ముప్పును తప్పించేందుకు, ఖమేనీ పాలనను అంతం చేసేందుకు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులను పెంచాలని ఆదేశించామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి పేర్కొన్నారు. మీడియా నివేదికల ప్రకారం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరానియన్ అణు ప్రదేశాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్కు మద్దతు పలకాలని భావిస్తున్న తరుణంలో యుద్ధ పరిణామాలు మరోమలుపు తిరిగాయి.
ఇది కూడా చదవండి: ‘యుద్ధం’ ఆపితే నోబెల్ రాదు: ట్రంప్ అదే ‘మధ్యవర్తిత్వ’ వాదనలు