హార్ముజ్‌కు మళ్లీ వెళ్లం | Indian Seafarers Relive War Trauma In Hormuz Strait, Hesitant To Return To Gulf Jobs, More Details Inside | Sakshi
Sakshi News home page

హార్ముజ్‌కు మళ్లీ వెళ్లం

Jul 2 2026 9:25 AM | Updated on Jul 2 2026 10:02 AM

hormuz strait war trauma indian sailors fear return

జలసంధి నుంచి బయటపడ్డ భారత నావికుల మనోగతం 

హార్ముజ్‌ జలసంధి.. పశ్చిమాసియా సంఘర్షణలో అత్యంత ప్రభావితమైన ప్రాంతం.  హార్ముజ్‌ గుండా ప్రయాణించడం అంటే నావికులు అసాధారణ ప్రమాదాలను ఎదుర్కోవడమే.  

యుద్ధంతో హార్ముజ్‌ జలసంధిలో నెలలపాటు చిక్కుకుపోయిన నావికులు ఎట్టకేలకు బయటకొచ్చారు.  

కానీ, మళ్లీ హార్ముజ్‌ పేరెత్తితేనే భయపడుతున్నారు. తాము మళ్లీ హార్ముజ్‌కు వెళ్లబోమని చెబుతున్నారు.  

పొట్టకూటికి వెళ్లడం తప్ప మరో మార్గం లేదని మరికొందరు ఆందోళన చెందుతున్నారు.  

వాణిజ్య నౌకాయానానికి నావికులను అందించే అతిపెద్ద దేశాల్లో భారత్‌ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సముద్రయాన నిపుణులను పంపిస్తుంది. 2025లో ప్రపంచ వాణిజ్య నౌకా రవాణాలో 320,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ తొలి దాడుల తర్వాత, ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని దిగ్బంధించింది. దీంతో ఘర్షణ సమయంలో గల్ఫ్‌లో వాణిజ్య నౌకాయానం లక్ష్యంగా మారింది. జూన్‌లో, ఒమన్‌ తీరంలో ఒక నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. 

అలాగే, భారతీయులు అధిక సంఖ్యలో ఉన్న మరో రెండు నౌకలపైనా దాడులు జరిగాయి. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది భారత నావికులు గల్ఫ్‌ను వదిలి వచ్చేశారు. వీరిలో, ఇరాన్‌ షిప్పింగ్‌ శాఖ సహాయంతో వెళ్లిన 3,600 మందికి పైగా ఉన్నారు. భారత నావికులున్న నౌకలపైనా దాడులు జరిగాయి. మరికొందరు తమ సహచరులు చనిపోవడాన్ని చూశారు.యుద్ధాన్ని ముగించడానికి మధ్యంతర ఒప్పందం కుదిరినప్పటికీ, దాడులు కొనసాగుతుండటం, ఇప్పటికీ హార్ముజ్‌ జలసంధి గుండా రాకపోకలు ఉద్రిక్తంగానే ఉండటంతో.. ఘర్షణ సమయంలో జలసంధిలో ఉండిపోయి బయటపడిన వారిలో చాలామంది ఆందోళన చెందుతూనే ఉన్నారు.  

దాడి తర్వాత తీవ్ర నిరాశ... 
‘‘మార్షల్‌ దీవుల జెండా ఉన్న ఒక బల్క్‌ క్యారియర్‌ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాన్ని స్వయంగా చూశాను.  మార్చిలో, మా కంపెనీకి చెందిన ‘సేఫ్‌సీ విష్ణు’ అనే ముడి చమురు ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఆ దాడిలో ఒక భారతీయ సిబ్బంది మరణించారు. కొన్ని వారాల తర్వాత, మా నౌకపైనా దాడి జరిగింది. తెల్లవారుజామున, నా షిఫ్టుకు సిద్ధమవుతుండగా దాడి జరిగింది. మాకేమీ కాలేదు. కానీ, దాడి తర్వాత మా సిబ్బంది మొత్తం తీవ్ర నిరాశలోకి జారిపోయారు. అది జీవితాన్ని మార్చే అనుభవం, ఊహించలేనంత భయంకరమైనది. ఆ దాడి నన్ను కూడా తీవ్రంగా కుదిపేసింది. నేను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాను. గల్ఫ్‌కు తిరిగి వెళ్లాలంటే భయంగా ఉంది. కానీ నేను పోషించాల్సిన కుటుంబం కూడా ఉంది కాబట్టి తప్పదు’’ అని గుజరాత్‌లోని చిన్న మత్స్యకార గ్రామానికి చెందిన 31 ఏళ్ల సీతారామ్‌ తండేల్‌ చెబుతున్నారు.  

పరిస్థితులు మెరుగుపడితేనే తిరిగి వెళ్తా.. 
‘‘గల్ఫ్‌ నుంచి బయలుదేరడానికి సిద్ధమైన మార్షల్‌ దీవుల జెండా ఉన్న ఒక సరుకు రవాణా నౌకలో మార్చిలో చేరాను. మేం దాటడానికి చాలా ప్రయతి్నంచాం. దాడుల తీవ్రత ఎక్కువగా ఉంది. మా కంపెనీకి చెందిన మరో నౌకపై దాడి జరిగింది.  ఘర్షణలు తగ్గినప్పుడు ‘ఈ ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నా’మని ధృవీకరిస్తూ పత్రాలపై సంతకాలు చేయమని కోరారు. చివరికి, అర్ధరాత్రి వేళ ఆ ప్రమాదకర ప్రాంతం గుండా ప్రయాణించాం.’’ అని కేరళకు చెందిన 45 ఏళ్ల రతీసన్‌ కుట్టియన్‌ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. పరిస్థితులు మెరుగుపడితేనే గల్ఫ్‌కు తిరిగి వెళ్తానంటున్నారు.
  
నావికుడిగా ప్రయాణించాల్సిందే.. 
‘‘ఒక సరుకు రవాణా నౌకలో హార్ముజ్‌ వైపు వెళ్తుండగా, మా ముందున్న నౌకపై దాడి జరిగింది. మా నౌక అబుదాబికి వెనుదిరిగింది. నేను యుద్ధ ప్రాంతంలో ఉన్నానని నా భార్యకు చెప్పలేదు. ఇప్పుడు విషయం తెలిసి ఇక ఎప్పుడూ గల్ఫ్‌ వెళ్లొద్దని చెబుతోంది. ఒక నావికుడిగా ప్రపంచమంతా ప్రయాణించాల్సిందేనని తెలుసు. కానీ.. తెలిసి తెలిసి ప్రాణాపాయ స్థితుల్లోకి వెళ్లలేం కదా’’ అంటున్నారు కేరళకు చెందిన 49 ఏళ్ల హరిదాస్‌. 

ఇక ఎప్పటికీ వెళ్లను..  
‘‘రెండు దశాబ్దాలకు పైగా సముద్ర ప్రయాణంలో గడిపాను. గల్ఫ్‌ నుంచి చైనా, సింగపూర్‌కు చమురును రవాణా చేస్తూ, అనేకసార్లు హార్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించాను. కానీ యుద్ధం నా దృక్పథాన్ని మార్చేసింది. మేం సింగపూర్‌కు బయలుదేరడానికి రెండు రోజుల ముందు యుద్ధం మొదలైంది. మా నౌకకు 10, 15 మీటర్ల దూరంలో ఒక హెలికాప్టర్‌ కూలిపోయింది. కొన్ని క్షిపణులు మాకు అతి దగ్గరగా దూసుకెళ్లాయి. నౌకను కదలించవద్దని ఆదేశాలు రావడంతో, దాదాపు మూడు నెలల పాటు అక్కడే నిలిచిపోయాం. భయమేసినా ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాయి. కాల్పుల విరమణ తర్వాతే నౌక కదిలింది. మే 29న దుబాయ్‌ మీదుగా నౌక బయలుదేరింది. విధులు ముగించుకుని దిగిపోయాను. ఇక హార్ముజ్‌కు ఎప్పటికీ వెళ్లను. నా ప్రాణం కంటే డబ్బు ఎక్కువ కాదు’’ అంటున్నారు 42 ఏళ్ల నావికుడు హిరేన్‌కుమార్‌ ప్రవీణ్‌.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement