‘ఇజ్రాయెల్’ను నాశనం చేస్తాం, కిల్ బిల్.. రూ.4 వేల కోట్లు! | Hamas Leaders Asked Iran For 500 Million Dollars In 2021 To Destroy | Sakshi
Sakshi News home page

‘ఇజ్రాయెల్’ను నాశనం చేస్తాం, కిల్ బిల్.. రూ.4 వేల కోట్లు!

Apr 8 2025 10:18 AM | Updated on Apr 8 2025 10:48 AM

Hamas Leaders Asked Iran For 500 Million Dollars In 2021 To Destroy

ఇరాన్ నేతలకు హమాస్ అభ్యర్థన

ఆ దన్నుతోనే అక్టోబరు 7 నరమేధం 

ఇజ్రాయెల్ చేతికి పత్రసహిత ఆధారాలు 
 

జెరూసలేం: ‘ఇజ్రాయెల్’ను సర్వ నాశనం చేయడానికి ఇరాన్ నుంచి హమాస్ ఉగ్రవాద సంస్థ భారీగా సొమ్మును అభ్యర్థించింది. ఈ ‘కిల్ బిల్’… 50 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.4,295 కోట్లు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం ఈ సంగతి వెల్లడించారు.

ఇరాన్ నుంచి అంత మొత్తాన్ని హమాస్ నేతలు యాహ్యా సిన్వర్, మహమ్మద్ దీఫ్ ఆర్థిక సాయంగా కోరినట్టు తెలిపే ఆధారసహిత పత్రాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ చేతికి చిక్కాయి. సిన్వర్, దీఫ్ ఇద్దరూ ఇటీవల మరణించారు. గాజాపై తాజా దాడుల సందర్భంగా తమ సైనికులకు ఆ పత్రాలు దొరికాయని, వాటిని ఇజ్రాయెల్ రక్షణ బలగాల (ఐడీఎఫ్) ‘ఇంటెలిజెన్స్ కేటలాగ్ యూనిట్’కు పంపామని కాట్జ్ తెలిపారు.

(ఫొటో రైటప్: మహమ్మద్ దీఫ్, యాహ్యా సిన్వర్, ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమెనీ (ఎడమ నుంచి కుడికి). వారి వెనుక అక్షరాలతో కనిపిస్తున్నది... హమాస్ సంస్థకు ఇరాన్ ఆర్థిక సాయానికి సంబందించిన రహస్య పత్రం)

ఆ పత్రాలు 2020 అక్టోబరు- 2021 జూన్ మధ్య కాలానికి చెందినవని, తాజా యుద్ధం నేపథ్యంలో సిన్వర్ వాటిని భూగర్భ సొరంగంలోకి తెచ్చాడని తెలుస్తోంది. ఇరాన్-హమాస్ దోస్తీకి ఆ పత్రాలు సాక్ష్యాధారాలని కాట్జ్ చెప్పారు. ఇరాన్ అందించిన దన్నుతోనే 2023 అక్టోబరు 7న ఇజ్రాయెలీలపై హమాస్ నరమేధానికి పాల్పడిందని చెప్పారు. 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం కావాలని యాహ్యా సిన్వర్, మహమ్మద్ దీఫ్ చేసిన విజ్ఞప్తికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ‘కుద్స్ ఫోర్స్’ (పాలస్తీనా వ్యవహారాలు) హెడ్ సయీద్ ఇజాదీ ఆమోదం తెలిపారని కాట్జ్ వెల్లడించారు.

ఆంక్షలు, ఆర్థిక సమస్యల్లో ఇరాన్ సతమతమవుతున్నప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలతో నెలకొన్న వైరానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆ మొత్తాన్ని అందించడానికి ఇజాదీ ఒప్పుకున్నారని చెప్పారు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలతోపాటుగా ఇరాక్, సిరియాల్లోని ఉగ్రవాద సంస్థల దుశ్చర్యలకు మూలం ఇరాన్ అని, ‘పాముకు తల’ ఇరాన్ అని ప్రపంచమంతా గ్రహించాలని కాట్జ్ కోరారు.

దాడులకు సంబంధించిన కచ్చితమైన సమయం, ‘అక్టోబరు 7 ప్రణాళికల’ గురించి ఇరాన్ నాయకత్వానికి తెలియదని, అయితే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) శిక్షణ, ఆయుధాలు, నిధులు లేకుండా అక్టోబరు 7న హమాస్ ఊచకోతకు పాల్పడేది కాదని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఇరాన్ నుంచి రూ.1,300 కోట్ల (154 మిలియన్ డాలర్లు) నిధులు హమాస్ ఉగ్ర సంస్థకు బదిలీ అయినట్టు తెలిపే పత్రాలను ఖాన్ యూనిస్ భూగర్భ సొరంగాల నుంచి ఇజ్రాయెల్ రక్షణ బలగాలు సంపాదించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రదర్శించాయి.

::జమ్ముల శ్రీకాంత్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement