
ప్రధాని నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. నేడు, రేపు(మంగళ,బుధ) ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. జీ-7 సదస్సులో ప్రధాని పాల్గొనున్నారు. జీ7 కూటమి వార్షిక సదస్సు నిన్న (సోమవారం) కెనడాలో ప్రారంభమైంది.
జీ7 ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో భారత్కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత ప్రధాని మోదీని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు.
VIDEO | PM Modi (@narendramodi) arrived at Calgary International airport, Canada, earlier today for the G7 summit.
(Source: Third Party) pic.twitter.com/YFjno8J9am— Press Trust of India (@PTI_News) June 17, 2025
కాగా, పశ్చియాసియా, యూరప్లో జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలపై భారత ప్రధాని మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యుద్ధాల యుగం కాదని తేల్చిచెప్పారు. వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని కోరారు. సోమవారం సైప్రస్ రాజధాని నికోసియాలో మోదీ, నికోస్ సమావేశమయ్యారు. భారత్–సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.
మరోవైపు, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని జీ7 దేశాల అధినేతలు తేల్చిచెప్పారు. రెండు దేశాలు వెంటనే వెనక్కి తగ్గాలని, యుద్ధానికి స్వస్తి చెప్పాలని కోరారు. ఇజ్రాయెల్–ఇరాన్ వెంటనే చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. పరస్పరం కలిసి చర్చించుకొని, ఘర్షణకు తెరతించాలని అన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించడమే లక్ష్యగా ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలని తామంతా అంగీకారానికి వచ్చినట్లు బ్రిటిష్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ చెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గాజాలోనూ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు సొంతం చేసుకొనేందుకు ఇరాన్ను అనుమతించకూడదని జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పారు. మరోవైపు జీ7 కూటమిపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించడం పొరపాటేనని చెప్పారు. రష్యాను పక్కనపెట్టడం ప్రపంచాన్ని ఇప్పుడు అస్థిరపరుస్తోందని అభిప్రాయపడ్డారు.