
వాషింగ్టన్: భారత్- పాక్ పోరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం-పాకిస్తాన్లు పరస్పరం యుద్ధం కొనసాగించకుండా నియంత్రించానని, అణు విపత్తుకు దారి తీయగలిగే పోరును ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. తాము పరస్పరం కాల్పులు జరుపుకునే దేశాలతో వాణిజ్యం కొనసాగించలేమని గతంలో ఇరు దేశాలకు స్పష్టం చేశానని ట్రంప్ తెలిపారు.
భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం అణు విపత్తుగా మారే అవకాశం ఉందని భావించానని అధ్యక్షుడు ట్రంప్ ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇరు దేశాలు యుద్ధాన్ని ముగించినందుకు ఆ దేశాధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఇరు దేశాలతో తాము సాగిస్తున్న వాణిజ్య వ్యవహారాలపై మాట్లాడుకున్నామని, పరస్పరం కాల్పులు జరుపుకుంటూ, అణ్వాయుధాలు(Nuclear weapons) ఉపయోగించే సత్తా కలిగిన వారితో వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పామని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్, పాక్లకు చెందిన నేతలు తమను అర్థం చేసుకున్నారని, తమ వినతిని అంగీకరించి, యుద్ధాన్ని ముగించారని ట్రంప్ అన్నారు. కాగా జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. ఆ తరువాత భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. నాలుగు రోజుల పాటు సాగిన డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత మే 10న భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగింపుపై ఒక ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేశాయి. కాగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి తాను సహాయం చేయగలనని ట్రంప్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: పాక్లో ఉద్రిక్తత.. ‘సురబ్’పై బీఎల్ఏ జెండా?