బీరూట్: ఇరాన్- అమెరికా మధ్య తాత్కాలిక ఒప్పందం నడుస్తోన్న వేళ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహూ రెచ్చగొట్టే చర్యలు చేశారు. దక్షిణ లెబనాన్లోని ఆ దేశ సైనిక స్థావరాలను సందర్శించారు. ఒకప్పుడు ఇజ్రాయెల్ను తన ఆయుధ సంపత్తితో భయపెట్టిన హిజ్బుల్లా ఇప్పుడు దాదాపు నాశనమైందన్నారు. ఈ సైనిక సామర్థ్యంలో దాదాపు 92శాతం తుడిచిపెట్టుకుపోయిందని ప్రసంగించారు.
ఇరాన్పై యుద్ధానికి ప్రధాన కారణం ఎవరంటే ప్రథమంగా గుర్తొచ్చే పేరు బెంజిమిన్ నెతన్యాహూ... వాస్తవానికి ట్రంప్ చాలాసార్లు తల బిరుసుగా మాట్లాడిన అతనిని ఉసిగొల్పింది మాత్రం నెతన్యాహూనే అంటారు. ఈ విషయం యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్ సైతం పలుమార్లు ప్రస్తావించారు. ఇటీవల ట్రంప్ సైతం నెతన్యాహును పలుమార్లు హెచ్చరించారు. శాంతిచర్చలను చెడగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 60రోజుల తాత్కాలిక ఒప్పందం నడుస్తోన్న సమయంలో నెతన్యాహు మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను సందర్శించి అక్కడ ఉద్వేగభరితంగా మాట్లాడారు.."ఒకప్పుడు ఇరాన్ మద్దతుతో 1,50,000 రాకెట్లు మరియు క్షిపణులతో ఇజ్రాయెల్ను భయపెట్టింది. హిజ్బుల్లా సైనిక సామర్థ్యంలో 92% భాగాన్ని ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రస్తుతం వారి వద్ద కేవలం 8% ఆయుధాలు (దాదాపు 12,000 రాకెట్లు) మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఈ పోరాటంలో ఇప్పటివరకు 9,000 మంది హిజ్బుల్లా మిలిటెంట్లను హతమార్చింది. అన్నారు.
ఇజ్రాయెల్ సరిహద్దుల లోపల కాకుండా, శత్రువుల భూభాగం (లెబనాన్) లోపలే సురక్షితమైన బఫర్ జోన్లను ఏర్పాటు చేయడం తమ అతిపెద్ద విజయమని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేయడానికి సరిహద్దుల్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు లేకుండా చేయడమే దీని లక్ష్యమని ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదన్నారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో లెబనాన్తో భద్రతా ఒప్పందం కుదిరినప్పటికీ, హిజ్బుల్లా ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్ నుండి వెనక్కి వెళ్లదు అని ఆయన తేల్చి చెప్పారు. హిజ్బుల్లా ఆయుధాలతో ఇక్కడ ఉంటూ ఇజ్రాయెల్ను బెదిరిస్తున్నంత కాలం, మేం కూడా ఇక్కడే ఉంటాం అని స్పష్టం చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి శాంతిచర్చలపై ప్రభావం చూపుతాయా అని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.


