Bangladesh: ఢాకాలో డెంగ్యూ దడ.. ఒక్క రోజులో రికార్డు స్థాయి మరణాలు | Bangladesh Sees Record Single day Dengue Deaths | Sakshi
Sakshi News home page

Bangladesh: ఢాకాలో డెంగ్యూ దడ.. ఒక్క రోజులో రికార్డు స్థాయి మరణాలు

Sep 22 2025 2:55 PM | Updated on Sep 22 2025 3:17 PM

Bangladesh Sees Record Single day Dengue Deaths

ఢాకా: బంగ్లాదేశ్‌ను డెంగ్యూ వ్యాధి పట్టిపీడిస్తోంది. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కేసులు, మరణాలు సంఖ్య ప్రభుత్వానికి దడ పుట్టిస్తోంది. దేశంలో డెంగ్యూ కారణంగా ఒక్క రోజులో  రికార్డు స్థాయి మరణాల సంఖ్య నమోదైంది. దీర్ఘకాలిక రుతుపవన పరిస్థితులు, దోమల విజృంభణ కారణంగా డెంగ్యూ వ్యాప్తి మరింత తీవ్రమవుతున్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స తీసుకోవడం, నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించడం ద్వారా డెంగ్యూను తరిమికొట్టవచ్చని వారు సూచిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో డెంగ్యూ  కారణంగా గడచిన 24 గంటల్లో 12 మంది మృతిచెందారు. రాజధాని ఢాకాలో కొత్తగా 700 కేసులు నమోదయ్యాయని  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 179 డెంగ్యూ బారిన పడి మృతిచెందగా, 42 వేల మంది డెంగ్యూ బారిన పడ్డారని పేర్కొంది. అధిక సంఖ్యలో పిల్లలు డెంగ్యూ బారినపడి ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. బాధితులలో చాలామంది అధిక జ్వరం, దద్దుర్లు, తీవ్రమైన నిర్జలీకరణతో బాధపడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో నిర్లక్ష్యం తగదని జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎబిఎం అబ్దుల్లా తెలిపారు.

2023లో దేశంలో డెంగ్యూ కారణంగా  రెండువేల మంది మరణించారు.  మూడు లక్షల21వేల మందికి పైగా జనం వ్యాధి బారిన పడ్డారు. డెంగ్యూ వైరస్ సాధారణంగా మధ్య , దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, పసిఫిక్ దీవులతో సహా ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది. డెంగ్యూ జ్వరం లక్షణాలు దోమ కాటు తర్వాత నాలుగు నుండి 10 రోజుల తర్వాత కనిపిస్తాయి. దోమ కాటు  బారినపడకుండా ఉండటమే డెంగ్యూ నివారణకు ఉత్తమమార్గమని వైద్యులు సూచిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement