యుద్ధంతో ప్రయోజనమే లేదు  | 1 in 4 Americans believes Iran war was worth its costs | Sakshi
Sakshi News home page

యుద్ధంతో ప్రయోజనమే లేదు 

Jun 25 2026 6:08 AM | Updated on Jun 25 2026 6:08 AM

1 in 4 Americans believes Iran war was worth its costs

సర్వేలో వెల్లడించిన మెజారిటీ అమెరికన్లు 

అత్యల్ప స్థాయికి ట్రంప్‌ ఆమోదం  

అధ్యక్షుడికి భారీగా తగ్గిన ప్రజాదరణ

ఇరాన్‌తో అమెరికా మధ్యంతర శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. యుద్ధ సమయంలో ఓడరేవులపై విధించిన అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఇరాన్‌ ముగించింది. దీంతో హార్మూజ్‌ జలసంధి తెరుచుకుంది. ఇరు దేశాలు శాశ్వత శాంతి కోసం కృషి చేస్తున్నాయి. ఇంతా చేసి ఈ నాలుగు నెలల యుద్ధంలో అమెరికా సాధించిందేమిటి? అగ్ర రాజ్యానికి 40 బిలియన్‌ డాలర్ల నష్టం మిగిల్చిన ఈ యుద్ధానికి తగిన ఫలితం వచ్చిందా? ఇదే విషయంపై రాయిటర్స్‌/ఇప్సోస్‌ జూన్‌ 18–22 మధ్య అమెరికాలో సర్వే నిర్వహించింది. ఇంతా చేస్తే అసలు ఈ సంఘర్షణకు విలువే లేదంటున్నారు సర్వేలో పాల్గొన్న సగం మంది అమెరికన్లు. యుద్ధానికి అయిన ఖర్చుకు తగిన ఫలితం సాధించిందని పావు వంతు అమెరికన్లు మాత్రమే నమ్ముతున్నారు. మరో పావు వంతు మాత్రం ఏమీ చెప్పలేమంటున్నారు.  

అమెరికా అగ్రరాజ్యం అంటే... ప్రపంచానికి పెద్దన్న పాత్ర. అలాంటి దేశానికి అధ్యక్షుడంటే ఎంతటి ప్రజామోదం ఉండాలి. కానీ.. యుద్ధ కాంక్షతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రజాదరణ తగ్గింది. రెండో పదవీకాలంలో అత్యల్ప స్థాయికి వచ్చింది. ఆయన ఆమోద రేటింగ్‌ 34%కి పడిపోయింది. ఇక, ప్రజల జీవన వ్యయంపై ట్రంప్‌కు ఆమోదం 22 శాతంగా ఉంది, ఇది ఆయన అధ్యక్ష పదవీకాలంలోనే అత్యల్ప స్థాయి. అంతేకాక, వైట్‌హౌస్‌లో ఆయనకు ముందున్న డెమొక్రటిక్‌ అధ్యక్షుడు జో బైడెన్‌ తన అధ్యక్ష పదవీకాలం చివరిలో పొందిన రేటింగ్‌ కంటే కూడా ఇది తక్కువ. 

బలహీన స్థితిలో అమెరికా 
ఇరాన్‌పై దాడులకు ఆదేశించడానికి ముందు ఉన్న దానికంటే అమెరికా ఇప్పుడు మరింత బలహీనమైన స్థితిలో ఉందని 35% మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అయితే, యుద్ధానికి ముందుతో పోలిస్తే ఇప్పుడు ఇరాన్‌తో అమెరికా మరింత బలమైన స్థితిలో ఉందని కేవలం 23% మంది అమెరికన్లు మాతమ్రే నమ్ముతున్నారు. వీరిలో ట్రంప్‌ సొంత పార్టీ రిపబ్లికన్‌కి చెందినవారు సగం మంది మాత్రమే ఉండటం గమనార్హం.  

శాంతి ఒప్పందం నిలవదు.. 
మరి ఈ మధ్యంతర శాంతి ఒప్పందంపై మెజారిటీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఒప్పందమైనా ఎక్కువ కాలం నిలస్తుందా అంటే? కష్టమేనంటున్నారు. ఇక, ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం జరిగే అవకాశం లేనే లేదని 63% మంది అమెరికన్లు చెబుతున్నారు. రిపబ్లికన్లలో దాదాపు సగం మంది, డెమొక్రాట్లలో ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే.. శాశ్వత శాంతి సాధ్యమవుతుందని 18 శాతం మంది నమ్ముతున్నారు. దీనిని విశ్వసించే వారిలో 34 శాతం రిపబ్లికన్లు, వీరిలో 10 శాతం డెమొక్రాట్లు ఉండటం గమనార్హం.  

పెరిగిన ద్రవ్యోల్బణం..  
ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని, ఖరీదైన విదేశీ యుద్ధాలకు అమెరికాను దూరంగా ఉంచుతానని వాగ్దానం చేసి ట్రంప్‌ 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. కానీ, మే నెలలో అమెరికా వార్షిక ద్రవ్యోల్బణం రేటు 4.2 శాతం పెరిగింది. 2023 తర్వాత ఇదే అత్యధికం. ఇరాన్‌ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరలే జీవన వ్యయ పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి. మధ్యంతర శాంతి ఒప్పందం ప్రపంచ ముడి చమురు ధరలు తగ్గినా.. అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులకు ముందున్న ధరతో పోలిస్తే, గ్యాసోలిన్‌ ధర ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. ఒక గ్యాలన్‌ సాధారణ పెట్రోల్‌ సగటు ధర 4.50 డాలర్లకు పైగా ఉన్న స్థాయి నుంచి 3.93 డాలర్లకు పడిపోయింది. అయితే, యుద్ధం ప్రారంభమవ్వడానికి ముందున్న ధరతో పోలిస్తే మాత్రం ఇది అధికమే.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement