ఎంతలో ఎంత మార్పు! | A Special Story In The Sakshi Guest Column About Charan Singh And Sanjay Gandhi | Sakshi
Sakshi News home page

ఎంతలో ఎంత మార్పు!

Jun 23 2026 10:44 AM | Updated on Jun 23 2026 10:44 AM

A Special Story In The Sakshi Guest Column About Charan Singh And Sanjay Gandhi

చరణ్‌ సింగ్‌, సంజయ్‌ గాంధీ

1977 మార్చిలో ప్రప్రథమంగా కేంద్రంలో ఏర్పాటైన కాంగ్రెసేతర  ప్రభుత్వ (జనతా పార్టీ) సంబరం మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసింది. కారణం, పార్టీ నాయకుల అంతర్గత కుమ్ములాట. తనకు దక్కవలసిన ప్రధాని పీఠం, మొరార్జీ దేశాయికి దక్కడంతో, ఉపప్రధాని చౌధరీ చరణ్‌ సింగ్‌ జీర్ణించుకోలేక పోయారు. ఈ తరుణంలో జనతా ప్రభుత్వాన్ని కూలదోయటానికి పక్కా వ్యూహం పన్నారు ఇందిరాగాంధీ. సరిపడా ఎంపీలతో జనతా నుండి బయ టకు వస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు చెందిన 154 మంది ఎంపీలు ఆయనకు మద్దతు ఇస్తార ని చరణ్‌ సింగ్‌కు సంజయ్‌ గాంధీ ద్వారా ఆఫర్‌ పంపారామె. 1979 జూలై 1న మంత్రి పదవికి రాజీనామా చేసి పార్టీ నుండి బయటకు వచ్చారు చరణ్‌ సింగ్‌. ఆమె ఆశించినట్టే మొరార్జీ ప్రభుత్వం పడిపోయింది.

రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1979 జూలై 28న చరణ్‌ సింగ్‌తో రాష్ట్రపతి భవన్‌లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. 23 రోజులు గడిచాక కాంగ్రెస్‌ ఎంపీలు చరణ్‌ సింగ్‌ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకున్నారు. పార్లమెంటులో బల పరీక్షకు వెళ్ళకుండానే, ఆగష్టు 20 నాడు పదవికి రాజీనామా చేసి పార్లమెంటును రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరారు కిసాన్‌ నేత చరణ్‌ సింగ్‌.

ఆగస్టు 22న లోక్‌సభ రద్దు కావడంతో 1980 జనవరిలో మధ్యంతర ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్‌ గెజిట్‌ నోటిపికేషన్‌ విడుదల చేసింది. సంజయ్‌ గాం«ధీ తన సన్నిహితులకు, యువతకు అత్యధిక టిక్కెట్లు ఇచ్చి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపారు. కాంగ్రెస్‌ 353 సీట్లతో అఖండ విజయం సాధించింది. ఎమర్జెన్సీ రోజుల్లో రాజ్యాంగేతర శక్తిగా అధికారం చలాయించిన సంజయ్‌... అమేథీ నియోజకవర్గం నుండి గెలిచి అఫీషియల్‌ సూపర్‌ పవర్‌ సెంటర్‌గా ఎదిగారు.

1980 జూన్‌ 23న ఉదయం 8 గంటలు. డిల్లీ సఫ్దర్‌జంగ్‌ ఎయిర్‌పోర్టు గగన వీధుల్లో టూ సీటర్‌ పిట్స్‌ – 2ఏ విమానం పచార్లు చేస్తూ దగ్గరే ఉన్న చెట్టుకు ఢీకొని మంటలతో నేలకూలింది. చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న రెండు శవాలు గుర్తుపట్టలేనివిధంగా కాలిపోయాయి. అవి ఆ విమానంలోని ఫ్లైట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ సుభాష్‌ సక్సేనా(50), ట్రైనీ పైలట్‌ సంజయ్‌ గాంధీ (33)వి అని తేలాయి. సంజయ్‌ గురించి కుష్వంత్‌ సింగ్‌ ‘99: అన్‌ఫర్గెటబుల్‌ ఫిక్షన్, నాన్‌– ఫిక్షన్, పొయిట్రీ అండ్‌ హ్యూమర్‌’ పుస్తకంలో ఇలా అన్నారు: ‘నాకు సంజయ్‌ అంటే ఇష్టం. కానీ అతను జీవించి ఉంటే, ఈ దేశంలో క్రమశిక్షణ ఉండేది, అభివృద్ధి కూడా వేగంగా జరిగేది. ప్రజాస్వామ్యం మాత్రం ఉండేది కాదు.’ – జిల్లా గోవర్ధన్‌ ‘ రిటైర్డ్‌ పీఎఫ్‌ కమిషనర్, ముంబై

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement