మహిళా ప్రయాణికుల భద్రతకు ట్యూటెమ్‌ యాప్‌ | safety of women passengers Hyderabad Metro announces TUTEM app | Sakshi
Sakshi News home page

Hyderabad Metro మహిళా ప్రయాణికుల భద్రతకు ట్యూటెమ్‌ యాప్‌

Apr 26 2025 4:40 PM | Updated on Apr 26 2025 5:01 PM

safety of women passengers Hyderabad Metro announces TUTEM app

గమ్యస్థానం వరకు సురక్షిత ప్రయాణం   

మెట్రో ఎండీ  ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడి   

మహిళలకు సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పింపంచేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్‌ మెట్రో ((HMR) రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం హైదరాబాద్‌ మెట్రో రైల్, హైదరాబాద్‌ పోలీస్‌ సహకారంతో సరికొత్త మొబైల్‌ యాప్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు. బిట్స్‌ పిలానీ–హైదరాబాద్‌ క్యాంపస్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ బొంబాయి సంయుక్తంగా ఏడీబీ ఆర్థిక సహాయంతో ట్యూటెమ్‌ (టెక్నాలజీస్‌ ఫర్‌ అర్బన్‌ ట్రాన్సిట్‌ టు ఎన్హాన్స్‌ మొబిలిటీ అండ్‌ సేఫ్‌ యాక్సెసిబిలిటీ) అనే ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. 

త్వరలో మొబైల్‌ యాప్‌ రూపంలో ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుందన్నారు. ఈ మేరకు బిట్స్‌ పిలాని హైదరాబాద్‌ క్యాంపస్‌లో గురువారం జరిగిన యూజర్‌ వర్క్‌ షాప్‌లో ఆయన మాట్లాడారు. రోజురోజుకు జటిలమవుతున్న ట్రాఫిక్‌ సమస్యకు ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే ఏకైక పరిష్కారమన్నారు. మెట్రోలో పయనించే మహిళలు తమ చిట్టచివరి గమ్యస్థానానికి భద్రంగా చేరడానికి ట్యూటెమ్‌ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంటి దగ్గర నుంచి గమ్యస్థానాల వరకు రాకపోకలు సాగించే క్రమంలో ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తుందన్నారు.  

ఈ మొబైల్‌ యాప్‌లో డ్రైవర్‌ యాప్, యూజర్‌ యాప్‌ అని రెండు భాగాలు ఉంటాయని, మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే అన్ని జాగ్రత్తలు ఇందులో ఉంటాయని ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు. ప్రయాణికులు మెట్రోస్టేషన్‌కు చేరుకోవడానికి, తిరిగి ఇంటికి బయలేదేరడానికి కాలినడకన, ద్విచక్ర వాహనంపై కానీ కారు లేదా బస్సు లేదా ఆటో తదితర ఎలాంటి ప్రయాణ సదుపాయాలను వినియోగించినా సరే ఈ యాప్‌ ద్వారా నిఘా ఉంటుందన్నారు. గమ్యస్థానికి చేరే క్రమంలో మహిళలు ఎలాంటి అభద్రతకు గురైనా వెంటనే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ను, కుటుంబసభ్యులను, బంధువులను అప్రమత్తం చేసే సదుపాయం ఉంటుందన్నారు. 

సామాజిక, ఆర్థిక సమస్యలకు ఇంజనీరింగ్, సాంకేతిక పరిష్కారం చూపాలన్నదే తమ అభిమతమని, అందుకు తగ్గట్టుగా కొత్త ఆవిష్కరణలకు ముందుంటామని ఎన్వీఎస్‌ తెలిపారు. బిట్స్‌ పిలానీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వి.రామ్‌ గోపాల్‌రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర నగరాలకు కూడా ఈ యాప్‌ను విస్తరించేలా తమ సంస్థ సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏడీబీ ప్రతినిధి కుమారి జోసెఫిన్‌ ఎక్వినో, బిట్స్‌ పిలానీ క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సౌమ్యో ముఖర్జీ, ఐఐటీ బొంబాయి కి చెందిన ప్రొఫెసర్‌ అవిజిత్‌ మాజీ, బిట్స్‌ పిలానీ ప్రొఫెసర్‌ ప్రశాంత్‌ సాహు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement