Miss World 2025: ఘనంగా ముగిసిన గ్రాండ్‌ ఫినాలే.. | Miss World 2025: 72nd Miss World Beauty Pageant Ends Successfully, Interesting Details Inside | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగిసిన మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలు

Jun 1 2025 1:05 PM | Updated on Jun 1 2025 3:35 PM

Miss world 2025: 72nd miss world beauty pageant ends successfully

ప్రపంచ వేదికపై హైదరాబాద్‌ నగర ప్రశస్తి మరోసారి అత్యంత వైభవంగా మారుమోగింది. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 108 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో మిస్‌ థాయిలాండ్‌ ప్రపంచ సుందరిగా నిలిచింది. నగరంలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ వేదికగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కళ్లు చెదిరే హంగులతో లైటింగ్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే నిర్వహించారు. ఈ వేదిక పై భారతీయ, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.  

మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే పోడియంపై తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు క్యాట్‌ వాక్‌ చేసే పోడియం ప్యానెల్లో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రానా దగ్గుబాటి, మరో సినీతార నమ్రత శిరోద్కర్‌ ఆశీనులయ్యారు. ఇదే వరుసలో ప్రముఖ ఫ్యాషన్‌ ఐకాన్, సామాజికవేత్త, మొట్టమొదటిసారిగా మిస్‌ వరల్డ్‌ బ్యూటీ విత్‌ పర్పస్‌ విభాగానికి గ్లోబల్‌ అంబాసిడర్‌గా ఎన్నికైన తెలుగు మహిళ సుధారెడ్డి ఉన్నారు. 

మెగా హంగామా.. 
ఈ పోటీలను వీక్షించడానికి మెగాస్టార్‌ చిరంజీవి తన భార్యతో కలిసి వచ్చారు. ఈ మెగా వేదికపై ప్రముఖ సెలబ్రిటీ ఇషాన్‌ కట్టర్‌ చేసిన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌ విశేషంగా అలరించింది. ఇందులో భాగంగా తను ఆస్కార్‌ విన్నింగ్‌ పాట నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేస్తుంటే.. చిరంజీవి సంతోషంగా చప్పట్లు కొట్టారు. స్టేజ్‌ పైన వదల బొమ్మాళీ డైలాగ్‌ చెప్పి ప్రేక్షకులను ఉత్సాహపరిచిన సోనూసూద్‌ తెలుగు సినిమాలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఆతిథ్యం అద్భుతం.. 
ఈ పోటీల నేపథ్యంలో తెలంగాణ అందించిన ఆతిథ్యం అద్భుతమని టాప్‌ 4లో నిలిచిన పోలండ్‌ కాంటెస్టెంట్‌ కొనియాడారు. ఇక్కడి మర్యాదలు ఆత్మీయత తనను కట్టిపడేశాయని.. భాగ్యనగరాన్ని తన రెండో ఇంటిగా అనుభూతి చెందానని సంతోషం వ్యక్తం చేశారు.  

ప్యానలిస్టుల్లో రానా, నమ్రత.. 
అంతే కాకుండా ఈ గ్రాండ్‌ ఫినాలేలో టాప్‌ 4 మార్టినిక్, ఇథియోఫియా, పోలెండ్, థాయిలాండ్‌ కాంటెస్టెంట్‌ లను చివరి ప్రశ్నలు అడిగిన నలుగురు ప్యానలిస్టుల్లో రానా, నమ్రత ఇద్దరూ తెలుగు వారే కావడం గమనార్హం. మరో రెండు ప్రశ్నలు అడిగిన ఇద్దరిలో సోనూ సూద్‌ కూడా హైదరాబాద్‌కు సుపరిచితుడే.  

( చదవండి: ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా)
 

Advertisement
 
Advertisement
Advertisement