
చీకూ చింతా లేని మంచి బ్యాంకు ఉద్యోగం వదిలి ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలంటే చక్కటి ప్రణాళికతో పాటు గుండెలు నిండుగా ధైర్యం, పట్టుదల, లక్ష్యసాధనకు అవసరమైన వనరులను సమకూర్చుకొని గొప్ప ఫలితాలు సాధించే తెలివితేటలు ఉండాలి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన సంకేత్ మెహతా (Sanket Mehta)కు అదృష్టవశాత్తూ ఇవన్నీ ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగం వదిలేసి రసాయనిక పురుగుమందుల అవసరం లేని ఆధునిక హైడ్రోపోనిక్ వ్యవసాయం (hydroponic farming) లోకి దిగారు. ఆరోగ్య దాయకమైన ఆహారం కోసం వెదుకుతూ పురుగుమందుల్లేని ఆహారోత్పత్తి వైపు దృష్టి సారించారు.
పూర్తి ఆర్గానిక్ కాకపోయినా రసాయనిక పురుగు మందుల్లేకుండా హైడ్రోపోనిక్స్ పద్ధతుల్లో కూరగాయ, ఆకుకూర పంటలు పండించి విక్రయించటం ద్వారా మంచి ఆహారాన్ని అందిస్తున్నామన్న తృప్తితో పాటు మంచి ఆదాయం కూడా వస్తుందని సంకేత్ భావించారు. చాలా కాలం నుంచి తెలిసిన గణేష్ నికం అనే వ్యక్తితో కలిసి న్యూట్రిఫ్రెష్ (Nutrifresh) పేరిట స్టార్టప్ను ఆరేళ్ల క్రితం నెలకొల్పి చక్కని ఆదాయం పొందుతున్నారు.
హైడ్రోపోనిక్స్ అంటే పోషకాలతో కూడిన నీటిలో, నియంత్రిత వాతావరణంలో (అంటే పాలీహౌస్లలో) పంటలు పండించటం. ఈ పద్ధతిలో కూరగాయలు, సాధారణ ఆకుకూరలతో పాటు సలాడ్లలో నగరవాసులు తినే లెట్యూస్ వంటి విదేశీ జాతుల ఆకుకూరలు మొత్తం 42 రకాలను పెంచి, విక్రయించటం ద్వారా సంకేత్, గణేష్ మంచి ఆదాయం ΄పొందుతున్నారు. పుణే ప్రాంతంలో చల్లని వాతావరణం పాలీహౌస్లలో హైడ్రోపోనిక్ సేద్యానికి అనువుగా ఉండటంతో ఈ యువకుల కలల పంట పండుతోంది. కాసులు కురిపిస్తోంది.

పురుగుమందులు వాడకుండా పండించటమే కాదు, పంట కోతలో ప్రత్యేక జాగ్రత్త తీసుకోవటం, కోసిన 24 గంటల్లోగా వినియోగదారుల ఇళ్లకు చేర్చటం వీరి విజయరహస్యం. సాధారణ గ్రామీణ మహిళలకు పంటల కోతలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి పనులు చేయిస్తున్నారు. ఆ ఫామ్లో పనిచేసేవారిలో 80% వీరే. దేశంలోని అనేక నగరాల్లో పురుగుమందుల్లేని ఆహారం కావాలనుకునే 40 వేల ఇళ్లకు న్యూట్రిఫ్రెష్ హైడ్రోపోనిక్ కూరగాయలు,ఆకుకూరలు, ఔషధ మొక్కల్ని అనుకున్న సమయానికి సరఫరా చేయగలుగుతోంది. నమ్మిన పనిని త్రికరణశుద్ధిగా చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేదానికి ఈ స్టార్టప్ పనితీరును నిదర్శనంగా చెప్పొచ్చు. శుద్ధిచేసిన నీటిని పంటల సాగుకు వాడటం, మొక్క పెట్టటం, పంట కోత, ప్యాకింగ్ వంటి పనులన్నీ ఖచ్చితత్వంతో నిర్వహిస్తూ నాణ్యమైన ఉత్పత్తుల్ని అందిస్తున్నారు. 2023 నాటి లెక్కల ప్రకారం సంకేత్ మెహతాతో సహా న్యూట్రిఫ్రెష్ వ్యవస్థాపకుల నికర విలువ రూ. 157 కోట్లుగా తెలుస్తోంది. (ఐదేళ్ల శ్రమ.. ఇంగువ పండిందోచ్! అవును నిజమే!)