బ్రెయిన్‌కు బూస్ట్‌.. ఇక ఆందోళనకు చెక్‌! | Health Article On The Occasion Of International Yoga Day June 21 | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌కు బూస్ట్‌.. ఇక ఆందోళనకు చెక్‌!

Jun 20 2026 10:06 AM | Updated on Jun 20 2026 2:09 PM

Health Article On The Occasion Of International Yoga Day June 21

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. జూన్‌ 21

యోగా.. నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరికీ పరిచయం చేయక్కర్లేని పదం. పాఠశాల స్థాయి నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయిస్‌ వరకు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. బ్రెయిన్‌ను రీవైరింగ్‌ చేస్తూ.. మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుందని అనేక పరిశోధనల్లో సైతం రుజువయ్యింది. అందుకే యోగా ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ప్రతి ఏటా జూన్‌ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ కేవలం ఒక రోజు వేడుక కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఆరోగ్య విప్లవంగా మారింది.

బ్రెయిన్‌కు బూస్ట్‌
యోగా అనగానే చాలామందికి కేవలం శరీరాన్ని విల్లుగా వంచడం, శ్వాసపై ధ్యాస పెట్టడం లేదా శారీరక దృఢత్వం కోసం చేసే ఒక వ్యాయామం మాత్రమే గుర్తొస్తుంది. కానీ, యోగా అంతకుమించి మన మెదడును సమూలంగా మార్చేయగలదని, మానసిక ఒత్తిడిని దూరం చేయగలదని ఇప్పటికే ఎన్నో పరిశోధనల్లో తేలింది. మెదడులోని నాడీ వ్యవస్థ తనను తాను పునర్నిర్మించుకునే ప్రక్రియను న్యూరోప్లాస్టిసిటీ అంటారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మెదడులో ఈ ప్రక్రియ వేగవంతమై, మానసిక స్థితి పూర్తిగా మారుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఒత్తిడి హార్మోన్లకు బ్రేక్‌!
మనం తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్‌ లో ఉన్నప్పుడు శరీరంలో ‘కార్టిసాల్‌’ అనే ఒత్తిడి హార్మోన్‌ విపరీతంగా విడుదలవుతుంది. ఇది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, కేవలం ఒకే ఒక్క యోగా సెషన్‌తోనే శరీరంలో కార్టిసాల్‌ స్థాయులు 30 శాతం వరకు తగ్గినట్లు గుర్తించారు. యోగాలోని ‘్రపాణాయామం’ మన శరీరంలోని పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థ  ఉత్తేజితమవుతుంది. ఇది గుండె వేగాన్ని, శ్వాసను నియంత్రించి శరీరానికి, మనస్సుకు పూర్తి ప్రశాంతతను ఇస్తుంది.

ఆందోళనకు చెక్‌
మెదడును ప్రశాంత పరిచే ‘గాబా’ అనే కెమికల్‌ కొరత వల్ల మనుషుల్లో యాంగ్జైటీ, డిప్రెషన్‌ పెరుగుతాయి. నిరంతర యోగా సాధన వల్ల మెదడులో ఈ ‘గాబా’ స్థాయులు గణనీయంగా పెరుగుతాయని, తద్వారా ఎలాంటి మందులు లేకుండానే మానసిక ఆందోళనలను అదుపులోకి తీసుకురావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తీవ్రమైన మానసిక గాయాలతో బాధపడేవారికి కూడా యోగా ఒక అద్భుతమైన థెరపీలా పనిచేస్తోందని తేలింది.

అయితే యోగా వల్ల కలిగే ఈ మానసిక ప్రయోజనాలు శాశ్వతంగా ఉండాలంటే మాత్రం క్రమం తప్పకుండా చేయడం మాత్రం తప్పనిసరి. ఇది ‘యూజ్‌ ఇట్‌ ఆర్‌ లూజ్‌ ఇట్‌’ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే యోగా ఆపేస్తే మెదడు మళ్లీ పాత స్థితికి చేరుకుంటుంది. అందువల్ల రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు సరళమైన ఆసనాలు,ప్రాణాయామం చేసినా మెదడును ఆధునీకరిస్తుంది. అద్భుతాలను సృష్టిస్తుంది. లేదంటే వాడని వస్తువులు తుప్పు పట్టినట్లే మెదడు కూడా ముందు స్థితికి 
చేరుకుంటుంది.

ఈ ఏడాది యోగా థీమ్‌...
ఈ సంవత్సరం అంటే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా 'Yoga for Healthy Ageing' అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు. వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే శారీరక మార్పులను తట్టుకుని, మానసిక స్థిరత్వంతో ఆరోగ్యంగా ఎలా జీవించాలనేదే దీని ముఖ్య ఉద్దేశం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement