Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా! | To day tip Interesting Natural Glowing Face flower Petals | Sakshi
Sakshi News home page

Beauty Tip పూల రెక్కలు, తేనె చుక్కలతో మెరిసిపోండి ఇలా!

Jun 13 2025 2:41 PM | Updated on Jun 13 2025 3:54 PM

To day tip Interesting Natural Glowing  Face flower Petals

పూల రెక్కలు... తేనెచుక్కలు  

సువాసనలు వెదజల్లే అందమైన పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ అందానికి అందంగా, సుగంధంగా గులాబీలు, మల్లె, జాజి పూలు అమ్మాయిలకు మరీ ఇష్టం.   పురాతన కాలం నుంచీ  మల్లి, జాజి, గులాబీ పూల రెక్కలను సౌందర్య సాధనంగా కూడా వాడేవారు. శరీరానికి మెరుపు, ముఖ తేజస్సును పెంచుకునేందుకు  గులాబీ రేకులకు, కాస్త తేనె, కూసింత పసుపు,ఇతర  అనేక సుగంధ ద్రవ్యాలను  కలిపి వాడతారు.   మరి ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డే లో భాగంగా గులాబీ బాలగా మన ముఖం మెరిసిపోవాలంటే ఇవిగో టిప్స్‌...

గులాబీ రేకులు, నల్ల నువ్వులు, బార్లీ గింజలు సమ పాళ్లలో తీసుకొని,  పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని తగినన్ని రోజ్‌వాటర్‌ కలిపి, ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. 

లేదంటే సింపుల్‌గా  పది గులాబీ రేకలను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల  రోజ్‌వాటర్‌, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే.. చక్కటి మెరుపు వస్తుంది. 

అర టీ స్పూన్‌ తేనె, రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. రోజ్‌ వాటర్‌తో చర్మ రంధ్రాలు శుభ్రపడి ముఖ చర్మం కాంతివంత మవుతుంది. (Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..)

ఆలివ్‌ ఆయిల్, అలొవెరా జెల్‌ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. 

చర్మం తాజాగా మెరుస్తూ ఉండాలంటే ఎప్పటికప్పుడు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. ఇందుకోసం కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. 

ఇదీ చదవండి: సంజయ్‌ మరణానికి కారణం ఓ తేనెటీగ : వైద్యులు ఎంత శ్రమించినా..!
మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, టీ స్పూన్‌ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్‌ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్‌  ప్యాక చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. 

 నోట్‌ : పువ్వులు ఎంత అందమైనవి అయినా  కొంతమందికి ఎలర్జీ కలిగించవచ్చు.  అందుకే ఏదైనా ప్యాక్‌ వేసుకునే ముందు కొద్దిగా టెస్టింగ్‌ ప్యాక్‌లా వేసుకోవడం  మర్చిపోవద్దు. ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement