
అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కంపెనీల్లో అంతులేని శోకాన్ని నింపింది. ఒక్కో కుటుంబానికి ఒక్కో విషాద గాథ. ఎన్నో ఆశలతో విమానం ఎక్కిన వందలమంది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఇలా ఉండగానే బిజినెస్ ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. సోనా కామ్స్టార్కు చెందిన ఉంజయ్ కపూర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. విమాన ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన కొన్ని గంటల తరువాత గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. అయితే ఆయన మరణం ఎలా జరిగిందో తెలిస్తే షాకవ్వక మానరు. మరణం ఎటువైపు ఎలా ముంచుకు వస్తుందో తెలియదు అనడానికి ఈ సంజయ్ మరణం నిదర్శనంగా నిలుస్తోంది.
పోలో క్రీడలో ప్రసిద్ధుడు, వ్యాపారవేత్త బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్, 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో యునైటెడ్ కింగ్డమ్లో మరణించారు. పోలో ఆడుతున్నప్పుడు, ఒక తేనెటీగ సంజయ్ నోటిలోకి దూరిపోయింది. పొరపాటున దాన్ని మింగడంతో అది గుండెపోటుకు దారితీసిందని చెబుతున్నారు. తక్షణమే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని. నిపుణులు కూడా పరిస్థితిని పరిష్కరించలేకపోయారట.
భారతదేశ ఆటోమోటివ్ రంగంలో ప్రముఖ వ్యాపారవేత్త, కపూర్ ఆటోమోటివ్ మార్గదర్శకుడు సురీందర్ కపూర్ కుమారుడు సోనా కామ్స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం బిజినెస్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎయిరిండియా ప్రమాదంపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంతలోనే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రమాదంపై ఆయన ట్వీట్
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై కపూర్ సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా ప్రమాదం భయంకరమైన వార్త. బాధిత కుటుంబాలందరికీ నా సానుభతి. ఈ క్లిష్ట సమయంలో ధైర్యాన్ని, శక్తిని పొందాలని కోరుకుంటున్నాను"
ఎవరీ సంజయ్ కపూర్
గురుగ్రామ్లో ఉన్న ప్రముఖ ప్రపంచ ఆటో విడిభాగాల తయారీదారు సోనా కామ్స్టార్ అధినేత సంజయ్ కపూర్. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ACMA) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు . అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) తయారీ మండలికి సహ-అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తాను చదువుకున్న డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. బకింగ్హామ్ విశ్వవిద్యాలయం నుండి HRలో BBA పూర్తి చేసిన తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లో చేరారు. సంజయ్ 2003లో తన తండ్రి కంపెనీలో పగ్గాలు చేపపట్టి ప్రపంచ బ్రాండ్గా దాన్ని తీర్చిదిద్దారు. సోనా కామ్స్టార్ అనే కంపెనీకి సంజయ్ ఛైర్మన్గా ఉన్నారు.