
కూచిపూడి కళాకారిణి శ్రవ్యమానస. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టిన శ్రవ్య తనకు తానుగా ఎక్కిన నిచ్చెన మెట్లే అన్నీ. తొమ్మిదేళ్ల వయసులో గజ్జె కట్టి... నేడు ‘మిస్ వరల్డ్ 2025’ కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శనలిచ్చిన ఘనతను తన ఖాతాలో జమ చేసుకున్నారు.
కళాకారుల బిడ్డ!
శ్రవ్య అమ్మానాన్నలిద్దరూ కళాకారులే. సామాన్య కుటుంబం కావడంతో ఉద్యోగం మీదనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. శ్రవ్య జీవితంలో నాట్యం, చదువు రెండూ సమతూకంగానే పెరిగాయి. ఎంటెక్ పూర్తి కాగానే హైదరాబాద్ మెట్రో రైల్లో ఉద్యోగం వచ్చింది. కానీ కళ కోసం ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. దేశవిదేశాల్లో ఆమె ప్రదర్శనలు పద్దెనిమిది వందలు దాటాయి. ఆమె అకాడెమీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల సంఖ్య మూడు వేలు దాటింది.
అధ్యయనమే గెలిపిస్తోంది!
‘నాట్యసాధనలో నిత్యం మేధోమధనం జరుగుతూ ఉండాలి. గురువులు నేర్పించిన జ్ఞానంతో సరిపుచ్చుకుంటే అక్కడే ఆగిపోతాం’ అంటారు శ్రవ్య. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో బుద్ధవనంలో ప్రదర్శన బుద్ధుడి ఇతివృత్తంగా ఉండాలన్నారు నిర్వహకులు. వారం రోజుల్లో బౌద్ధాన్ని అధ్యయనం చేసి, కాస్ట్యూమ్స్ లేత రంగులతో నిరాడంబరంగా డిజైన్ చేసి, బృందం మొత్తానికి కుట్టించడం వరకు ఎందులోనూ రాజీ పడలేదామె. అలాగే చౌమొహల్లా ప్యాలెస్ ప్రదర్శనకు సితార్ వంటి నిజాం సంగీత శైలితో సెమీ క్లాసికల్ రూపొందించి ప్రదర్శించారు. పోచంపల్లిలో తెలుగు జానపదం కోలాటం, శిల్పారామంలో బృందావనం, బంజారా, రాసలీలలు ప్రదర్శించి చూపారు.
ఆర్ద్రతే కళ
క్యాన్సర్ పేషెంట్కి విగ్ తయారు చేయడానికి సహజమైన కేశాలు అవసరమని తెలిసి గుండు చేయించుకుని తన కేశాలనిచ్చారు శ్రవ్య. కళాకారులను బతికించేది మనసు లోతుల్లోంచి ఉబికి వచ్చే ఎమోషనే. ఈ సున్నితత్వాన్ని తనలో పదిలపరుచుకుంటున్నారామె. అబుదాబిలో శ్రీనివాస కల్యాణం ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్ రావడం మధురానుభూతి, యాసిడ్ సర్వైవర్ మనోగతాన్ని ఆవిష్కరించడం నర్తకిగా ఆమె సామాజిక బాధ్యత.
కళాకారులు సామాజిక సమస్యల మీద స్పందించడంతోపాటు సాంకేతికంగా కూడా ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకోవాలి. చెయ్యి పట్టుకుని నడిపించే గాడ్ఫాదర్లు లేని శ్రవ్య మానస... డిజిటల్ వేదికగా ప్రపంచానికి సుపరిచితం కావడం వల్లనే మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాల్లో నాట్య ప్రదర్శన అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘వ్యక్తిగా పరిపూర్ణత సాధించిన బ్యూటీ ప్రాజంట్స్ నుంచి చాలా నేర్చుకున్నాను’... అన్నప్పుడు ఆమెలో శిఖరాన్ని అధిరోహించిన సంతోషం వ్యక్తమైంది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి