
రూ. 60 వేల నగదు, 70 తులాల బంగారం
ఇతర విలువైన వస్తువులు అధికారులకు అప్పగించిన రాజు
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే, అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ మానవత్వాన్ని చాటుకున్న వైనం నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఆయన ప్రదర్శించిన చొరవ, నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటోంది
అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ (56) విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హా హా కారాలు వినపడుతున్నాయి. ఇది విన్న నరాజు పటేల్ వెంటనే స్పందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే అదుపు చేయలేని రీతిలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ఇంతలో సహాయ దళాలు అక్కడికి చేరుకున్నాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిమందిలో రాజు, దట్టమైన పొగ, పెరుగుతున్న మంటలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నా గందర గోళ పడలేదు. స్థానికులు ఇచ్చిన బట్టలు, చాపలను ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమయం వృథా చేయకుండా, గాయపడ్డవారిని వీలైనంత వేగంగా అంబులెన్స్లలోకి ఎక్కించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు, వారిని రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరడం గమనార్హం.

అంతేకాదు సంఘటనా స్థలం శిథిలాల నుండి రూ. 60 వేల నగదు, 70 తులాల (బంగారం, హారాలు, గాజులు, మంగళసూత్రాలు, ఉంగరాలు, ) బంగారు ఆభరణాలను వెలికితీశారు. ఇంకా విదేశీ కరెన్సీ, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, వెండి వస్తువులను సేకరించి వాటిని జాగ్రత్తగా, నిజాయితీగా పోలీసులకు తిరిగి ఇచ్చారు.
‘‘మొదటి 15 నుండి 20 నిమిషాల వరకు, తొందరగా దగ్గరికి చేరుకోలేకపోయాము. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కానీ మొదటి అగ్నిమాపక దళం , 108 అంబులెన్స్లు వచ్చిన తర్వాత,సహాయం చేయడానికి ముందుకు సాగాం’’ అన్నారు రాజు. సమయానికి స్పందించడంతో పాటు, ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఆయన చేసిన సేవలతో పాటు తాను సేకరించిన వస్తువులను ఎంతో నిజాయితీగా అధికారులకు అప్పగించడం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రాజు పటేల్, బృందానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆపద సమయాల్లో ఆదుకున్నవాడే మానవుడు మహనీయుడు అని పేర్కొంటున్నారు.