ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు కలెక్టరేట్లో సో మవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో 328 అర్జీలు స్వీకరించినట్టు జేసీ ఎంజే అభిషేక్ గౌడ తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి, డీఆర్వో ఎం.శ్రీదేవి, ఆర్డీఓ కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నిర్ణీత సమయంలోపు అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు.
అర్జీల్లో కొన్ని..
● చింతలపూడి మండలం పట్టాయగూడేనికి చెందిన సుంకర పార్వతి తమ గ్రామంలోని అటవీ భూముల్లో 100 మంది గ్రూపుగా కూరగాయలు సాగు చేసుకుంటున్నామని, సదరు భూమిని కొందరు ఆక్రమించుకుని తమపై దౌర్జన్యానికి దిగారని, తమకు న్యాయం చేయాలని కోరారు.
● జంగారెడ్డిగూడెం మండలం కేతవరానికి చెందిన వి.మణెమ్మ తనకు స్థలం మంజూరు చేశారని, ఇంటి నిర్మాణానికి రుణం, సబ్సిడీ మంజూరు చేయాలని కోరారు.
● టి.నర్సాపురం మండలం తిరుమలదేవిపేటకు చెందిన వేమా శ్యామల రీసర్వే లో తనకు 20 సెంట్లు తక్కువగా నమోదైందని, సరిచేయాలని అభ్యర్థించారు.
● జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన అలకాల సోమిరెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పునరావాస ప్యాకేజీ సొమ్ము వేరే వారికి మంజూరు చేశారని, న్యాయం చేయాలని కోరారు.


