దారి మరిచిన ఎస్‌సీవో! | Sakshi Editorial On Shanghai Cooperation Organisation | Sakshi
Sakshi News home page

దారి మరిచిన ఎస్‌సీవో!

Jun 27 2025 12:56 AM | Updated on Jun 27 2025 12:56 AM

Sakshi Editorial On Shanghai Cooperation Organisation

ఆర్భాటంగా ఏర్పడటం, ఘనంగా లక్ష్యాలు చాటుకోవటం, కీలక సమయాల్లో మొహం చాటేయటం ప్రాంతీయ సహకార సంస్థలకు అలవాటుగా మారింది. సంక్షుభిత ప్రపంచంలో సమస్యలు రావటం సహజమే అయినా, దేశాల మధ్య తలెత్తే విభేదాలు అలాంటి సంస్థల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆ సంస్థల వల్ల ఉద్రిక్తతలు ఉపశమిస్తాయనుకోవటం అమాయకత్వమని రుజువు చేస్తున్నాయి. సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) అవస్థ అలాగే ఉంది. 

ఆ సంస్థ రక్షణ మంత్రుల స్థాయి శిఖరాగ్ర సదస్సు రెండు రోజులు జరిగి గురువారం చైనాలోని చింగ్‌దావ్‌లో ముగిశాక విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన భారత్‌ కారణంగా మూలన పడింది. ఆ ప్రకటనపై సంతకం చేసేందుకు మన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిరాకరించటంతో చేసేదేమీ లేక ఉమ్మడి ప్రకటన ఆలోచనే విరమించుకున్నారు. ఈ సదస్సుకు మన దేశంతోపాటు చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కిర్గిజ్‌ రిపబ్లిక్, కజఖ్‌స్తాన్‌ తదితర దేశాల రక్షణమంత్రులు హాజర య్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం ఎలా అనే అంశంపై సదస్సు జరిగింది. 

ఎస్‌సీవో 2001లో షాంఘైలో ఏర్పడినప్పుడు అది అందరిలో ఆశలు రేకెత్తించింది. ఎందుకంటే మధ్య ఆసియా దేశాల భద్రత, అభివృద్ధిపైనే ప్రధానంగా కేంద్రీకరిస్తామని సంస్థ తెలిపింది. భారత్, చైనాల మధ్య ఏనాటి నుంచో సరిహద్దు వివాదాలున్నాయి. ఇక పాకిస్తాన్‌  నాలుగు దశా బ్దాలుగా సరిహద్దు చొరబాట్లను ప్రేరేపిస్తూ ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌సీవో వల్ల చైనా, పాక్‌లతో ఉన్న సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశ ఉండేది. 

2005 నుంచి మన దేశం పరిశీలక హోదాలో సదస్సులకు హాజరవుతూ వచ్చింది. 2017లో రష్యా అధినేత పుతిన్‌ చొరవతో భారత్‌ పూర్తి స్థాయి సభ్యదేశమైంది. కానీ, సభ్య దేశాల వ్యవహార శైలి దేని దారి దానిదే! ఎస్‌సీవో స్థాపనలో కీలక పాత్ర పోషించిన చైనాయే 2020 జూన్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)వద్ద చొరబాటు యత్నం చేసింది. చైనా సైన్యం రాళ్లతో, కర్రలతో, రాడ్లతో దాడి చేసి 21 మంది మన జవాన్ల ప్రాణాలు తీసింది. అంతకుముందూ, ఆ తర్వాతా చైనా తీరు అదే.

తాజా శిఖరాగ్ర సదస్సులో విభేదాలకు దారితీసిన అంశం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొన్న మార్చిలో పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) మిలిటెంట్లు జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్‌ చేసి పలువురు పాక్‌ సైనికులను హతమార్చారు. పాక్‌ సైన్యం కూడా ప్రతీకార దాడికి దిగి ఆ ఘటనలో పాల్గొన్న మిలిటెంట్లలో అత్యధికుల్ని కాల్చిచంపింది. 

ఆ మరుసటి నెలలో కశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో పాక్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు నిరాయుధులైన పర్యాటకులపై దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ రెండు దాడుల్లో కేవలం బలూచిస్తాన్‌ ఘటనను ఉమ్మడి ముసాయిదా ప్రకటన ప్రస్తావించి పెహల్‌గామ్‌ను మినహాయించింది. ఆ ఉదంతం తర్వాత మన దేశం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయటం, పాక్‌ సైన్యం దాడుల్ని తిప్పికొట్టడానికి వారి వైమానిక స్థావరాలను ధ్వంసం చేయటం పతాక శీర్షికలకెక్కాయి. 

ఆ ఘటనల పరంపర జరిగి నిండా నెల్లాళ్లు కాకుండానే ఎస్‌సీవో ఎలా మరిచి పోతుంది? చైనా, పాక్‌ల మధ్య సాన్నిహిత్యం ఉంది గనుక ఆ దేశం చెప్పి నట్టల్లా ఆడి ఉమ్మడి ప్రకటన రూపొందించటం, దానిపై మన దేశం సంతకం చేయాలని కోరుకోవటం తెలివితక్కువతనం కాదా? అసలు ఇలాంటి తీరుతెన్నులు సమష్టి తత్వాన్ని దెబ్బ తీస్తాయన్న స్పృహ ఉండొద్దా?

ఎస్‌సీవో స్థాపించిన కాలంకన్నా ఇప్పుడు ప్రాంతీయంగా సవాళ్లు ఎన్నో రెట్లు పెరిగాయి. ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంత శాంతికీ, భద్రతకూ ముప్పు ఏర్పడుతోంది. దేశాల మధ్య పరస్పరం అవిశ్వాసం కూడా గతంతో పోలిస్తే ఎంతగానో పెరిగింది. ఈ సమయంలో ఎస్‌సీవో వంటి సంస్థ ఈ సమస్యలకు అర్థవంతమైన పరిష్కారం ఆలోచించాలి. కానీ జరిగిందంతా వేరు. 

ఈ సదస్సులో ప్రసంగించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నట్టు రాజ్యేతర శక్తుల వల్లా, ఉగ్రవాద ముఠాల వల్లా ప్రమాద కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటి వెనకున్న దేశాలు ఆ పరిస్థితుల పర్యవసానాలను ఎదుర్కొని తీరాలని కూడా ఆయన అన్నారు. రాజ్‌నాథ్‌ ప్రసంగంలో పెహల్‌గామ్, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రస్తావనకొచ్చాయి. అయినా ముసాయిదా ప్రకటన వాటిని మరిచినట్టు నటించింది.

ఎస్‌సీవోను సభ్యదేశాలు తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి తప్ప సమష్టిగా అడుగులేయాలన్న సంకల్పం ప్రదర్శించటం లేదు. ఈ సంస్థ చాటున తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)నూ, పలుకుబడినీ పెంచుకోవటమే చైనా ఎజెండా. సంస్థను మధ్య ఆసియా దేశాలకు మించి విస్తరింప జేయాలన్న ఉద్దేశంలోని ఆంతర్యం కూడా అదే. 

ఇక రష్యాకు ప్రధానంగా పాశ్చాత్య దేశాలతో లడాయి ఉంది. వాటిని ఎదుర్కొనటానికి సంస్థ ఎంతో కొంత తోడ్పడుతుందన్న ఆశ ఉంది. ఎస్‌సీవోను చిత్తశుద్ధితో నిర్వహిస్తే ఈ ప్రాంత దేశాలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎస్‌సీవో వాటా 23 శాతం. ప్రపంచ జనాభాలో వాటా 42 శాతం. 

సంస్థ పెట్టినప్పుడు సభ్య దేశాలమధ్య సైనిక సహకారం, నిఘా నివేదికల్ని పంచుకోవటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటం, విద్య, ఇంధనం, రవాణా రంగాల్లో సహకరించుకోవటం వంటి ఉద్దేశాలున్నాయి. కానీ ఇవన్నీ మరిచి ముఠాలు కట్టి నచ్చినవారికి అనుకూలంగా వ్యవహరించదల్చుకుంటే ఇలాంటి సంస్థలెందుకు? ఈ గంభీరమైన లక్ష్య ప్రకటనలెందుకు? అందుకే ఎస్‌సీవో తీరు మారాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement