
జనతంత్రం
‘‘ఆరు సూపర్ సిక్స్ హామీలూ పూర్తయ్యాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎవరైనా సూపర్ సిక్స్ అని మాట్లాడితే, వారికి నాలుక...’’ అంటూ వాక్యం మధ్యలో చంద్రబాబు కాస్త విరామం పాటించారు. ఆ ప్రెస్ మీట్ను టీవీల్లో చూస్తున్న వాళ్లకు నాలుకను కోసేస్తా అంటారేమో అనే అనుమానం రావడం సహజం. ఎందుకంటే, గత ఏడాదికాలంగా హామీల అమలు గురించి గట్టిగా ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం, ఏదో వంకతో జైలుకు పంపించడం అందరూ గమనిస్తూనే ఉన్నారు గనుక! చంద్రబాబు పాటించిన వాక్య విరామంలో గట్టి హెచ్చరికను పంపించే ఉద్దేశం కూడా ఉండవచ్చు. విరామం తర్వాత వాక్యాన్ని ‘మందం’ అనే మాటతో ముగించారు. అంటే ఇకముందు ఎవరైనా సరే సూపర్ సిక్స్ అమలు కాలేదని మాట్లా డితే వారి నాలుక మందం అనుకోవాలి. వాక్య విరామ హెచ్చరిక కూడా వారికి వర్తిస్తుందనుకోవాలి.
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ‘తల్లికి వందనం’ నిధుల విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ పరోక్ష హెచ్చరిక జారీ చేశారు. ‘తల్లికి వందనం’ పథకాన్ని కూడా 2025–26 అకడమిక్ ఇయర్ కోసం విడుదల చేశారు. బకాయి పడిన గత సంవత్సరం నిధులు హుష్ కాకే! మిగిలిన ఐదు పథకాల సంగతి? వాటినెప్పుడు అమలు చేశారు? దీపం పథకం కింద ఏటా ఇవ్వాల్సిన మూడు ఉచిత సిలిండర్ల బదులు రెండు ఇచ్చారు. సరే, అది కూడా అమలైంది.
‘అన్నదాత సుఖీ భవ’ కింద రైతుకు ఇస్తానన్న రూ. 20 వేల నగదు సాయానికి కూడా ఓ అంటకత్తెర కథ చెప్పారు. ఈ నెల 20న కేంద్రం విడుదల చేసే రెండు వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విడత విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం మూడు విడతల్లో విడుదల చేసే ఆరు వేలకు మరో 14 వేలను మూడు విడతల్లో కలిపి అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బకాయి పెట్టిన గతేడాది సొమ్ము అటకెక్కినట్టే! మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణానికి ఆగస్టు 15న ముహూర్తం పెట్టినట్టు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాలి.
సూపర్ సిక్స్లో భాగంగా ఉన్న మరో రెండు అతి కీలకమైన పథకాలను మాత్రం దేవుడి ఖాతాలో వేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. పందొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ.1500 చొప్పున ఏటా 18,000 రూపాయలను జమ చేస్తా మని కూటమి ఇచ్చిన ఎన్నికల హామీ.
ఇప్పుడు దాన్ని పీ–ఫోర్ అనే పథకంతో లింక్ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే ఆడబిడ్డల అదృష్టాన్ని డబ్బున్న వారి ఔదార్యంతో ముడి వేశారన్నమాట. ఎన్నికల హామీ ప్రకారం ఈ పథకానికి దాదాపు ఏటా 35 వేల కోట్లు అవసరమని అంచనా. ఇంతటి ఔదార్యాన్ని పి–ఫోర్ పథకం ద్వారా పిండుకోవాలట! ఇది అయ్యే పనేనా?
సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంది. పన్నెండు నెలలు బకాయి పెట్టారు. ఇప్పుడు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంతో జత చేస్తామని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది? నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇస్తారు? అందులో ఈ మూడు వేల రూపాయలు పోషించే పాత్రేమిటి? అనే మీమాంసలనవసరం.
ఈ పథకానికీ పాడె కట్టినట్టే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో యాభ య్యేళ్లు నిండిన ప్రతివారికీ పెన్షన్ అమలు చేస్తామని మరో కీలకమైన వాగ్దానాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దాని గురించి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ మాటా లేదు, ముచ్చటా లేదు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను విశ్లేషిస్తే ఒక్క మొదటి యేడాదికే రూ. 80 వేల కోట్లకు పైగా వాగ్దాన భంగానికి పాల్పడినట్టు తేలింది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నాయకులు ఫ్లాగ్ షిప్గా పెట్టుకున్న సూపర్ సిక్స్లోనే అరకొరగా రెండు, అత్తెసరుతో మరో రెండు ప్రకటించారు. భారీగా వ్యయమయ్యే ఇంకో రెండు పథకాలకు తిలోదకాలొదిలేశారు. ఫ్లాగ్షిప్ సంగతే ఇట్లా ఉంటే మిగతా మేనిఫెస్టో హామీల గురించి చర్చించడానికేముంటుంది? మోసం చేశారని ఆవేశపడటం తప్ప. మేనిఫెస్టో మీద, దాని హామీల మీద చర్చ జరగడం కూడా కూటమి సర్కార్ సహించడం లేదు. మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశామని వారు చెబుతున్నారు. అందరూ అదే చెప్పాలి. ఇందుకు భిన్నంగా ఎవరూ మాట్లాడకూడదు.
పత్రికల్లో గానీ, టీవీల్లో గానీ, సోషల్ మీడియాలో గానీ ఇందుకు భిన్నమైన సమాచారం రాకూడదు. వస్తే రెడ్బుక్ నోరు తెరుస్తుంది. రెడ్ బుక్ ఆదేశాలతో దాదాపు వెయ్యిమంది సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదయ్యాయి. పలువురిని అరెస్టు చేశారు. పలు కుటుంబాలు ఇంకా వేధింపులకు గురవు తున్నాయి. 70 మంది పాత్రికేయులపై కేసులు పెట్టారు. పదిమందిపై దాడులు చేశారు.
ప్రత్యర్థి రాజకీయపక్షంపై జరుగుతున్న దాడులను ఇక్కడ ప్రస్తావించడం లేదు. వారిపై జరుగుతున్న హత్యాకాండ జోలికెళ్లడం లేదు. వారి ఆస్తుల విధ్వంసం గురించి కూడా చెప్పడం లేదు. కేవలం పాత్రికేయులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దమనకాండను గురించి మాత్రమే ఈ నివేదన. వారి కలాలకూ, గళాలకూ బిగిస్తున్న శృంఖలాలను గురించి మాత్రమే ఈ ఆవేదన.
నాలుగున్నర దశాబ్దాలు పాత్రికేయ అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఈ భయానక పాలనకు ఒక స్పష్టమైన ఉదాహరణ. పత్రికా రంగంలో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కొమ్మినేని.
రెండు పత్రికల్లో స్టేట్ బ్యూరో చీఫ్గా పనిచేశారు. ఢిల్లీ బ్యూరోకు నాయకత్వం వహించారు. ఒక పత్రికలో ఒకే సమ యంలో సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జిగా నేను, స్టేట్ బ్యూరో చీఫ్గా కొమ్మినేని కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ అనుభవంతో చెప్పగలిగిన మాట ఒక్కటే. పాత్రికేయ వృత్తి పట్ల, ఆ వృత్తిలో పాటించవలసిన ప్రమాణాల పట్ల పూర్తిస్థాయి నిబద్ధత కలిగిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు.
న్యూస్ ఛానెళ్ల పర్వం ప్రారంభమైన తర్వాత దాదాపు పద్దెనిమిదేళ్లుగా మూడు టీవీ చానెళ్లలో కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో వర్తమాన రాజకీయాలపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నారు. ఈ తరహా చర్చా కార్యక్రమాల్లో అత్యంత సంయమనం పాటిస్తూ హద్దుమీరకుండా, చర్చ పక్క దారి పట్టకుండా తన నియంత్రణలో నడిపించే వారిలో అగ్ర గణ్యుడు కొమ్మినేని.
అమరావతి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడాడని కొమ్మినేని మీద, వార్తా విశ్లేషకుడు కృష్ణంరాజు మీద పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సెక్షన్ కూడా ఒకటి. పెరుగుతున్న వేశ్యల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉన్నదనే ఒక నివేదికను కృష్ణంరాజు ప్రస్తావించారు. ఈ తరహా వార్తలు గతంలో యెల్లో మీడియాలో కూడా వచ్చినవే.
ఈ ప్రస్తావన సందర్భంగా అమరావతిని ఉద్దేశించి కృష్ణంరాజు మాటల్లో దొర్లిన ఒక అనుచిత వ్యాఖ్యానాన్ని షో నిర్మాహకుడైన కొమ్మినేనికి కూడా ఆపాదించి ఒక వ్యూహం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మహిళల ప్రదర్శనలనూ, సాక్షి మీడియాపై దాడులనూ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. కొమ్మినేని, కృష్ణంరాజు, సాక్షి మీడియాలపై కేసులు నమోదు చేశారు. కొమ్మినేనిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినప్పుడు అట్రాసిటీ కేసుపై మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధం లేని కేసులు పెట్టడంపై ఎస్పీకీ, డిఎస్పీకి మెమోలు కూడా ఇచ్చారు. ఆ సెక్షన్ తొలగించి రిమాండ్కు పంపారు.సుప్రీంకోర్టులో కొమ్మినేనికి ఊరట లభించింది. తాను చేయని వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా బాధ్యుల్ని చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ లాయర్లను ప్రశ్నించింది. ఈ కేసులో కూడా ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లోద్రా వంటి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసే లాయర్లనే కూటమి ప్రభుత్వం మోహరించింది.
కొమ్మినేనికి వెంటనే బెయిల్ లభిస్తే మిగతా పాత్రి కేయుల్లో ప్రభుత్వం పట్ల భయం మిగలదనే సందేహం కావచ్చు. ఆ బెయిల్ను అడ్డుకునేందుకు భారీ గానే ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. విశ్లేషకుని వ్యాఖ్యానానికి కొమ్మినేని నవ్వాడు గనుక ఆయన కూడా శిక్షార్హుడేనని కూటమి లాయర్లు చేసిన వాదన సుప్రీంకోర్టులో నవ్వుల పాలైంది. కొమ్మి నేనిని వెంటనే విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
విఫల పాలనతో ప్రజామోదం కోల్పోతున్నప్పుడు అసంతృప్తిని చల్లార్చడానికి నియంత పాలకులు ఎక్కువగా నిర్బంధాన్నే నమ్ముకుంటారు. విమర్శకులు నవ్వినా, తుమ్మినా, దగ్గినా కూడా తిరుగుబాటు సంకేతంలాగానే వారికి కనిపించవచ్చు. నవ్వులే కాదు పువ్వులు కూడా వారిని భయపెడతాయి, వారి నీడలు కూడా వారిని భయపెడతాయి. ఈ భయం నుంచి బయటపడాలంటే వారి ముందున్న మార్గం ఒకటే. తాము ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోను ధైర్యంగా ప్రభుత్వ కార్యా లయాల్లో అంటించుకోవాలి.
ఇదిగో ఇన్ని హామీలను అమలు చేశామని ఇంటింటికీ వెళ్లి వైసీపీలాగా ధైర్యంగా చెప్పగలగాలి. లేకుంటే రాబోయే మూడునాలుగేళ్లూ నిర్భంధ కాండనే నమ్ము కోవాల్సి వస్తుంది. నిర్బంధకాండలో ఎవరూ నిలబడలేరని చరిత్ర చెబుతున్నా పాలకులకు చెవికెక్కదు. ఎంతమందిని భయపెట్టాలనుకున్నా, ఎంతమందిని జైలుకు పంపినా, ఎంత హత్యాకాండ కొనసాగించినా రాబోయే మార్పును ఆపడం సాధ్యం కాదు. ‘నువ్వు అన్ని పువ్వులనూ కోసి పారేయవచ్చు, కానీ వచ్చే వసంతాన్ని ఆపడం నీ తరం కాదు...’ చిలీ దేశానికి చెందిన సుప్రసిద్ధ స్పానిష్ కవి పాబ్లో నెరూడా చెప్పిన నిత్య సత్యాన్ని గుర్తు చేసుకోవడం అవసరం.
మందీ మార్బలంతో పత్రికా కార్యాలయంపై దండెత్తడం, అక్షరాన్ని దహనం చేసే ప్రయత్నం చేయడం ఎంత అవివేకమైన చర్యలో చరిత్ర తప్పక నిరూపిస్తుంది. టీవీలో ఓ యాంకర్ నవ్వు, ఇన్స్టాలో ఓ యువ కుడి సెటైర్, వేదికపై ఓ గాయకుడి పాట, పొలంలో ఓ రైతన్న ఆగ్రహం... ఇలాంటివన్నీ తనకు నచ్చలేదని కేసులు పెడుతూ పోతే జనానికి కొన్ని కామెడీ పాత్రలు గుర్తుకొస్తాయి. నవ్వి పోదురు గాక నాకేటి... అనుకుంటే ఇంకేమీ ఉండదు మరి.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com