● లొల్లలో 10 కాసుల బంగారం చోరీ
● ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ విద్య
రాయవరం: ఆరోగ్యం బాగా లేదని కుమార్తె దగ్గరకు వెళితే.. ఇంటిలోని బంగారం, వెండిని దొంగలు దోచుకుపోయారు. రాయవరం మండలం లొల్ల గ్రామంలో చోటు చేసుకున్న చోరీ శనివారం సభ్యుల రాకతో బయటపడింది. గ్రామానికి చెందిన కొరిపెల్ల సుబ్బలక్ష్మి, చిన్న కుమార్తెతో కలిసి లొల్లలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది మే నెలలో అనారోగ్యానికి గురైన సుబ్బలక్ష్మిని పెద్ద కుమార్తె, అల్లుడు లొల్ల వచ్చిన సందర్భంలో హైదరాబాద్లో ఉన్న ఆస్పత్రిలో చూపించేందుకు తీసుకుని వెళ్లారు. జూన్ 1న సామాజిక పింఛన్ తీసుకుని వెళ్లిన ఆమె శనివారం పెన్షన్ తీసుకునేందుకు చిన్న కుమార్తెతో కలిసి వచ్చారు. ఇంట్లోకి వెళ్లే సరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. ఇంట్లో ఉంచిన 10 కాసుల బంగారం, 100 గ్రాముల వెండి పోయినట్లుగా గుర్తించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.12 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాయవరం ఎస్సై డి.సురేష్బాబు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, ఎస్సై సురేష్బాబులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.


