
చీకటి.. రిలాక్స్ డ్ గా ఉండే సమయంలో చీకటిని ఒకింత ఆస్వాదిస్తాం. కానీ అదే చీకటిలో ఎక్కువ సేపు ఉండాలంటే ‘వామ్మో’ అంటాం. చాలా మంది చీకటి అంటేనే భయపడతారు. మరి అదే చీకటి కారణంగా ఓ జీవితంలో చిమ్మ చీకటి ఏర్పడితే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓ కుటుంబాన్ని చీకటి పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిందనే చెప్పాలి. అది వారి తలరాత అనుకోవాలో.. లేక విధి ఆడిన నాటకమనుకున్నా ఓ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో రాయల్ ఫార్మ్ విల్లా కాలనీలో చోటు చేసుకున్న విషాదానికి చీకటే కారణంగా నిలిచింది. ఒకవైపు భారీ వర్షం, ఈదురు గాలులతో కరెంట్ పోతే, అదే సమయంలో ఓ చిన్నారి లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటన తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. రాయల్ ఫార్మా అపార్ట్ మెంట్ లోని 307 ఫ్లాట్ లో ఉంటుంన్న రిషిరాజ్ కుటుంబం ఇప్పుడు చీకటి తెచ్చిన విషాదాన్ని తల్చుకుని రోదిస్తున్న తీరు వర్ణనాతీతంగా మారింది.
కొడుకును రక్షించబోయి..
సోమవారం(మే 26 వ తేదీ) రాత్రి గం. 10 లకు. భారీ వర్షం కారణంగా పవర్ సప్లై నిలిచిపోయింది. ఆ సమయంలో రిషిరాజ్ తన ఎనిమిదేళ్ల కొడుకు దేవాన్ష్ గురించి ఆరా తీశాడు. అయితే ఆ పిల్లాడు కిందకు వెళ్లాడని తల్లి చెప్పడంతో తండ్రి రిషిరాజ్ హుటాహుటీనా దేవాన్ష్ గురించి వెతకడం ప్రారంభించాడు. అయితే ఆ సమయంలో ఆటోమేటిక్ గా పని చేయాల్సిన జనరేటర్ పని చేయకపోవడాన్ని గ్రహించాడు.
దేవాన్ష్.. దేవాన్ష్ అంటూ ఆ ఫ్లోర్ నుంచే అరవడం ప్రారంభించాడు. అయితే పాప..పాప(నాన్న నాన్న) అంటూ చిన్నగా ఓ గొంతు వినిపించింది. అది తన కుమారుడుదేనని గ్రహించిన తండ్రి.. తన పిల్లాడికి ధైర్యం చెబుతూ కిందకు జనరేటర్ ఉన్న స్థలానికి పరుగు తీశాడు. అంతే నిమిషాల వ్యవధిలో లిఫ్ట్ ఆన్ చేయడం, ఆ తండ్రి అక్కడే కుప్పకూలడం జరిగిపోయాయి.
విధి రాత అంటే ఇదేనేమో..
ఆ కాలనీ ఎంతో సంతోషంగా ఉంటూ అందరి సమస్యలను పట్టించుకునే రిషిరాజ్ ఇక లేడనే వార్త స్థానికంగా ఉన్నవారిని తీవ్రంగా కలిచివేసింది. చీకటి.. ఆ జీవితాన్ని చిమ్మ చీకటిలో నెట్టేసిందని, విధి రాత అంటే ఇదేనేమో అంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఆ కుటుంబం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. రిషిరాజ్ భార్య, పిల్లల్ని ఓదార్చడం కాలనీ వాసుల వల్ల కావడం లేదు. జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్లి ఇలా కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కులేనిదిగా మిగిలింది.
సీపీఆర్ చేసి ప్రయత్నించినా..
రిషిరాజ్ కుప్పకూలడంతో తొలుత సీపీఆర్ చేశారు. ఆ చీకటిలో రిషిరాజ్ కుప్పకూలిపోవడాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రాణం కోల్పోయి జీవచ్ఛవంలా పడిఉన్న రిషిరాజ్ ను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
లిఫ్ట్ అంటే భయం..
లిఫ్ట్ ఎక్కి అందులో ఇరుక్కుపోయిన దేవాన్ష్.. ఒకప్పుడు అదే లిఫ్ట్ అంటే తీవ్రంగా భయపడిపోయేవాడట. క్రమేపీ లిఫ్ట్ భయాన్ని తండ్రి పోగొట్టినా, చివరకు అదే లిఫ్ట్ కారణంగా తన తండ్రి ఆందోళనకు లోనై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని మరింత బాధిస్తుంది. ఇదే విషయాన్ని రిషిరాజ్ భార్య పదే పదే గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
లోతుగా దర్యాప్తు ..
అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న మిస్రోడ్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక సమస్య కారణంగా జనరేటర్ ఆగిపోవడం, అదే సమయంలో లిఫ్ట్ ఆన్ చేయడానికి రిషిరాజ్ వెళ్లి అక్కడే పిల్లర్ కింద పడి ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినా, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సదరు పోలీస్ స్టేషన్ అధికారి మనీష్ రాజ్ భడోరియా తెలిపారు.