ఘటనా స్థలంలో పోలీసుల విచారణ
సాక్షి, చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంబేద్కర్ కాలానీలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్న ఇందిర అనే మహిళ శనివారం తన భర్త వెంకట్రావును కిరాతకంగా హతమార్చింది. భర్తను పీక కోసి చంపేసింది. వివాహేతర సంబంధం కారణంగా ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పరిస్థితుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఇందిరను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గత కొంత కాలంగా వెంకట్రావు, ఇందిర దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరో మహిళతో వెంకట్రావు వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విబేధాలు మొదలయ్యాయి. తాజాగా ఈ రోజు కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఇందిర కత్తి తీసుకుని వెంకట్రావును హతమార్చింది. ఈ ఘటనలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
చదవండి: పాపం! డాక్టర్ ప్రియాంక.. ఇంత దారుణమా?


