నక్కపల్లి: కాగిత రెవెన్యూ పరిధిలో చెరువులు, గెడ్డలను మిట్టల్ స్టీల్ ప్లాంట్కు బదలాయించడం సమంజసం కాదని గ్రామస్తులు, రైతులు ముక్తకంఠంతో ఖండించారు. గ్రామ పరిధిలో 17 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులు, గెడ్డలను స్టీల్ ప్లాంట్కు అప్పగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించి, చెరువుల కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు సాగు జరుగుతోందని పేర్కొన్నారు. సాగునీటి వనరులను పరిశ్రమలకు కేటాయించడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. అనంతరం తీర్మానం కాపీని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


