పాయకరావుపేట: నేతన్న సేవ పథకం కింద ఆర్థిక సాయం అందకపోవడంతో పట్టణంలోని పలువురు చేనేత కార్మికులు స్థానిక చేనేత సహకార సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో 113 మంది చేనేత కార్మికులకు నేతన్న సేవ పథకం సాయం అందాల్సి ఉంది. వీరిలో 71 మందికి మాత్రమే సాయం అందింది. మిగతా 42 మంది చేనేత కార్మికులు చేనేత సహకార సంఘం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు జగతా శ్రీనివాస్, తదితరులు మద్దతు తెలిపారు. సమస్యపై సంఘం మేనేజరు గోరు నాగేశ్వరరావుతో చర్చించారు. అలాగే చేనేత జౌళీ శాఖ ఏడీతో ఫోన్లో మాట్లాడారు. సాంకేతిక సమస్య కారణంగా కొందరి నేతన్న సేవ పథకం సాయం ఇంకా అందలేదని, అర్హులందరికీ సాయం అందుతుందని ఏడీ చెప్పినట్లు నాయకులు తెలిపారు. దీంతో చేనేత కార్మికులు నిరసన విరమించారు.


