వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. | The mother killed her son | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

Jun 16 2024 4:44 AM | Updated on Jun 16 2024 7:47 AM

The mother killed her son

కొడుకు గొంతు నులిమి హత్య చేసిన తల్లి  

పటాన్‌చెరు టౌన్‌: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్నకొడుకునే హత్య చేసిందో తల్లి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, పటాన్‌చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పుల్కంపేటకు చెందిన స్వాతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో భర్త కుమార్‌ మృతి చెందాడు. వీరికి విష్ణువర్ధన్‌ (8)అనే కుమారుడు ఉన్నాడు. 

ఈ క్రమంలో స్వాతి ఆరు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్‌తో కలసి ఉంటోంది. మూడు నెలల నుంచి వీరు పాత రామచంద్రపురంలో నివాసం ఉంటున్నారు. అయితే తల్లి వ్యవహార శైలిపై కొడుకు నిలదీసేవాడు. ఈ క్రమంలో 10వ తేదీన తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కొడుకు తమకు అడ్డుగా ఉన్నాడని కోపం పెంచుకున్న స్వాతి తాగిన మైకంలో కొడుకు గొంతు నులిమి హత్య చేసింది. 

అనిల్‌కు తన కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని నమ్మబలికింది. ఇద్దరూ కలసి మృతదేహాన్ని అదేరోజు రాత్రి పటాన్‌చెరు మండలం ముత్తంగి సర్వీస్‌ రహదారి పక్కన పడేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. మృతుడు పాత రామచంద్రపురానికి చెందిన బాలుడని తేలడంతో పోలీసులు స్వాతి ఇంటికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. 

పోలీసుల భయంతో స్వాతి, అనిల్‌ శుక్రవారం రాత్రి వారు ఉంటున్న గదిని ఖాళీ చేసేందుకు రాగా పటాన్‌చెరు పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో కొడుకును తానే హత్య చేసినట్లు విచారణలో స్వాతి ఒప్పుకోవడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement