కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు | BRS Kavitha judicial custody extended | Sakshi
Sakshi News home page

కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

May 8 2024 5:10 AM | Updated on May 8 2024 5:10 AM

BRS Kavitha judicial custody extended

ఈడీ కేసులో 14 వరకు.. సీబీఐ కేసులో 20వ తేదీ వరకు పొడిగించిన ప్రత్యేక కోర్టు

బెయిల్‌ కోసం నేడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న కవిత!

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్‌ మట్టా కోరారు.

కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్‌ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్‌ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

 జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్‌ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్‌ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్‌ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్‌ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

నా అరెస్టు అన్యాయం: కవిత
అధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్‌’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్‌ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement