అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి దెబ్బతిన్న ఊపిరితిత్తులు రూ.50 లక్షలు కావాలంటున్న వైద్యులు దాతలు ముందుకు వచ్చి ఊపిరి పోయాలని తల్లిదండ్రుల వేడుకోలు
పెద్దపంజాణి:ఆమె ఉన్నత విద్య అభ్యసిస్తోంది. కోర్సు పూర్తికావస్తుండడంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశపడింది. విధి చిన్న చూపు చూసింది. అరుదైన వ్యాధి ఆమెను పట్టుకుంది. భవిష్యత్తుౖపై ఎన్నో ఆశలు పెట్టు కున్న ఆమె నేడు ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది. పెద్దపంజాణి మండలం కరసనపల్లికి చెందిన వెంకటరమణ, లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ సీఏ చదువుతోంది. ప్రస్తుతం ఫైనలియర్లో ఉంది. త్వరలో కోర్సు పూర్తికానున్న నేపథ్యంలో ఆమె కు ఫాంజియోలియోమయోమాటోసిన్ అనే అరుదైన ఊపిరి తిత్తుల వ్యాధి వచ్చింది. ఇది మహిళల్లో అరుదుగా కనిపిస్తుందని, దీనివల్ల ఊపిరితిత్తుల్లో అసాధారణ కణాల పెరుగుదల జరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని వైద్యులు తెలిపారు. వ్యాధి ముదిరిన దశలో ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు. ఇందుకు సుమారు రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు ఏమి చేయాలో దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు.ఒకప్పుడు కుటుంబ సభ్యు లతో సంతోషంగా గడిపిన రమ్యశ్రీ ఇప్పుడు వెంటిలేటర్పై ఉండి ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది. ఇప్పటికే ఉన్న పొదుపు మొత్తం చికిత్సకే ఖర్చు కావడంతో తల్లిదండ్రులు బిడ్డను బతికించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా, క్రౌడ్ ఫండింగ్ వేదికల ద్వారా నిధుల సేకరణ కొనసాగుతోంది. రమ్యశ్రీ ప్రాణాలను కాపాడేందుకు తమకు చేతనైనంత సహాయం అందించాలని కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రజలను వేడుకుంటున్నారు.


