పదివేలిస్తే డాక్టరేట్ ఇస్తామంటున్న ఏజెంట్లు నకిలీ యూనివర్సిటీల మాయాజాలం జోరందుకున్న వ్యాపారం డబ్బులున్న అమాయకులే వీరి టార్గెట్ దృష్టిసారించని పోలీసు నిఘా వ్యవస్థ
పలమనేరు: గతంలో కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఓ నకీలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ల ప్రదాన కార్యక్రమంపై అక్కడి పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేసిన విషయం అప్పట్లో సంచలనమైంది. జిల్లాలో నూ ఇటీవల పలు నకిలీ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు ఇప్పించే ఏజెంట్లు ఎక్కువయ్యారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు తాము మోసపోయామని ఆలస్యంగా తెలిసి చేసేదేమీ లేక, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.
అమాయకులే వీరి టార్గెట్
ముందుగా ఆయా ప్రాంతాల్లో బాగా డబ్బు న్న అమాయకులను ఏజెంట్లు టార్గెట్ చేస్తా రు. ముఖ్యంగా సమాజంలో సేవా కార్యక్రమాలను చేస్తున్న వారిని పసిగడతారు. ఆపై సూటూ బూటు ఖరీదైన కారులో వచ్చి తాము ఫలానా యూనివర్సిటీ నుంచి వచ్చామని మీ సేవలకు మెచ్చి తాము గౌరవ డాక్టరేట్ ఇస్తున్నామని ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన వీరికి ఇచ్చామంటూ ప్రముఖులును నమ్మబలుకుతారు. ఇదంతా మీ సేవలకు గుర్తింపేనని తాము చెప్పిన చోటుకు కుటుంబంతో వచ్చి అవార్డును స్వీకరించాలని చెబుతారు. అయితే మీటింగ్ హాళ్లో మీకిచ్చే సూట్, కోట్కు మాత్రం రూ.10 వేలు ఇవ్వాలంటూ వసూలు చేస్తారు. కార్యక్రమంలో డాక్టరేట్ పొందుతున్న వారి గురించి బాగా పొగిడి ఆపై తమ యూనివర్సిటీకి మీరు నచ్చినంత విరాళం ఇవ్వాలంటూ టెండర్ వేస్తారు. అక్కడి మయ సభలో బాధితులు వీరి మాటల మాయల్లో పడి లక్షల్లో ఇచ్చుకున్నవారు ఉన్నారు. లేదంటే కనీసం పది వేలైనా వసూలు చేయకుండా నిర్వాహకులు వదలరు. గతంలో ఇలాంటి గౌరవ డాక్టరేట్లు పొందిన వారి ద్వారానే కొత్త వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఇదో మంచి వ్యాపారంగా మారడంతో ఎవరుపడితే వాళ్లు అమాయకులను టార్గెట్ చేసి గౌరవ డాక్టరేట్ మాయా ప్రపంచంలో ఊహల్లో తేలేలా చేస్తున్నారు.
చదువుకున్నోళ్లు సైతం..
గత మూడేళ్లలో ఇలా మోసపోయినవారు జిల్లాలో చాలామంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో రాజకీయ నాయకులు, రిటైర్ట్ అధికారులు, అధ్యాపకులు, ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, రియల్ ఎస్టేట్ బిల్టర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఉన్నారు.
చింతిస్తున్న నిజమైన గౌరవ డాక్టరేట్లు
యూనివర్సిటీలు ప్రఖ్యాతిగాంచిన వారికిచ్చే గౌరవ డాక్టరేట్లు ఇలా ఎవరికంటే వారికివ్వడంతో నిజమైన గౌరవ డాక్టరేట్లున్న వారు తాము గౌరవ డాక్టర్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డబ్బులిచ్చి మోసపోయామేనని మదనపడుతున్నా పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు నామోషీగా భావించండంతో నిర్వాహకుల ఆటలు సాగుతున్నాయి. అమాయకులను బురిడీ కొట్టించే వారిపై జిల్లా పోలీసువర్గాలు దృష్టి సారించాలని పలువురు మేధావులు కోరుతున్నారు.
వీళ్లెక్కడి గౌరవ డాక్టర్లు సామీ!
సమాజంలో సేవచేసిన వారికి విశ్వవిద్యాలయాలు గౌరవంగా అందజేసే గౌరవ డాక్టరేట్లు అంగట్లో సరుకుల్లా మారాయి. పదివేలు ఇస్తే చాలు ఎవరికై నా సరే గౌరవ డాక్టరేట్లు రెడీ అవుతున్నాయి. కొన్ని నకిలీ యూనివర్సిటీలు, అకాడమీలు తమ ఏజెంట్ల ద్వారా నెట్వర్క్ చేస్తూ అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఈ దందాను కొనసాగిస్తున్నాయి.


