Sullurpeta: సామాజిక జైత్రయాత్ర | - | Sakshi
Sakshi News home page

Sullurpeta: సామాజిక జైత్రయాత్ర

Jan 22 2024 1:14 AM | Updated on Jan 22 2024 12:47 PM

- - Sakshi

సామాజిక సాధికార వేదికపై నేతల సంఘీభావం

ఒక కుటుంబంలో చిచ్చుపెట్టి, బంధాలను చీల్చే కుట్ర రాజకీయాలు... అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అబద్ధపు ప్రచారాలు... చంద్రబాబు, ప్యాకేజీస్టార్‌ పవన్‌ కలిసి చేస్తున్న దగాకోరు రాజకీయాలు... ఇవన్నీ ఒక ఎత్తయితే పచ్చ పత్రికలు రాస్తున్న తప్పుడు కథనాలు... టీవీ చానెళ్లలో జగనన్నపై చేస్తున్న దుష్ప్రచారం... వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠం నుంచి దించాలనే ప్రతిపక్షాల కుతంత్రాలు.. ఇవన్నీ కలిసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తుంటే, ప్రజలు మాత్రం జగనన్న వెంటే అంటూ సామాజిక సాధికార యాత్రకు తరలివచ్చిన జనసంద్రం చెబుతోంది. ఇది జైత్రయాత్రలా సాగింది.

సూళ్లూరుపేట: నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో ఆదివారం చేపట్టిన సామాజిక సాధికారయాత్రతో పట్టణమంతా జనసంద్రంలా మారింది. గుండెలనిండా జగనన్నపై అభిమానాన్ని నింపుకుని పట్టణ వీధుల్లో జగనన్న సైనికులు కవాతు నిర్వహించినట్టుగా సాగింది సామాజిక సాధికార యాత్ర.

సంక్షేమ పథకాల సృష్టికర్త, నిరుపేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన ఆశాకిరణం, ప్రతి పేదింటికీ పెద్ద కొడుకుగా, తమ్ముడిగా, అన్నగా, మనవడిగా, మామయ్యగా నిలిచిన జగనన్నకు జై అంటూ నినాదాలతో పట్టణం మారుమోగింది.

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనం తండోపతండాలుగా తరలిరావడంతోనాయుడుపేట పట్టణంలో జాతరను తలపించింది. ముందుగా పట్టణంలోని పిచ్చిరెడ్డితోపు విజయగణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలతో యాత్ర ప్రారంభమైంది.

వైఎస్సార్‌కు నివాళి అర్పిస్తున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

అక్కడి నుంచి గాంధీమందిరం, పార్కు, గడియారం సెంటర్‌, వెల్‌కమ్‌ సెంటర్‌, పెద్ద దర్గామీదుగా పురవీధుల్లో బాణసంచా వేడుకలతో వేలాదిమంది జనం మధ్యన సామాజిక సాధికార ర్యాలీ సాగింది. ర్యాలీ సాగినంత సేపు వైఎస్సార్‌సీపీ నాయకులపై పూలు చల్లి పట్టణ ప్రజలు వారి అభిమానాన్ని చాటుకున్నారు. సాధికార బస్సు యాత్ర సాగుతున్నంత సేపు జై జగన్‌.. జైజై జగన్‌ అనే నినాదాలు మిన్నంటాయి.

సాధికారయాత్ర పాత బస్టాండ్‌వద్దకు చేరుకోగానే అక్కడే వున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, దివంగతనేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, సావిత్రిభాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ప్రతిమకు పూలమాలలు వేశారు.

రాజ్యసభ సభ్యులు, రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ వేణుంబాక విజయసాయిరెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రులు కళత్తూరు నారాయణస్వామి, అంజాద్‌బాషా, జిల్లా పార్టీ అధ్యక్షులు, వెంకటగిరి ఇన్‌చార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి పీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణచక్రవర్తి, మేరిగ మురళీధర్‌, కామిరెడ్డి సత్యనారా యణరెడ్డి లాంటి పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేశారు.

ప్రసంగిస్తున్న విజయసాయిరెడ్డి, పక్కన ఎమ్మెల్యే కిలివేటి, ఎన్‌డీసీసీబీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి

ఆ తరువాత ముందుగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సభకు అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేశారు. ఆయన సూళ్లూరుపేట నియోజకవర్గంలో గడిచిన అయిదేళ్లలో రూ.3,470 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశామన్నారు.

సంక్షేమ పథకాల కింద డీబీటీ రూపంలో రూ.1,275 కోట్లు, నాన్‌ డీబీటీ కింద రూ.7,200 కోట్లు నిరుపేదల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా వెళ్లిందని చెప్పారు. అభివృద్దికి, సంక్షేమానికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలన్నారు. అనంతరం డిప్యూటీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్‌బాషా, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రసంగించారు.

బాబులంతా బెంబేలు
అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రసంగిస్తున్నంత సేపు సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ఇందులో ముఖ్యంగా ‘‘ఇటీవల బాబులు తయారయ్యారంట.. చంద్రబాబు, లోకేష్‌బాబు, కల్యాణ్‌బాబు, బాలయ్యబాబులట. ఈ బాబులందరినీ కట్టకట్టుకుని బంగాళాఖాతంలో కలిపేసే రోజు మనముందుంది. జగనన్న కొట్టే దెబ్బకు ఈ బాబులంతా బెంబేలెత్తిపోవడం గ్యారంటీ.’’ అని చెప్పడంతో జనమంతా చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని తెలిపారు.

సాధికార యాత్రకు హాజరైన జనసందోహంలో ఒక భాగం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసి దళితులకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని అన్నారు. విచ్చేసిన అహుతులందరికీ ఎమ్మెల్యే కిలివేటి శాలువాలు కప్పి బుద్దుడు బొమ్మలను బహూకరించారు. ఈ సభకు అశేష జనం తరలిరావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement