వి.కోట : స్వగ్రామానికి వెళుతుండగా మంగళవారం చైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ప్రమాదంలో అక్కాచెల్లెలు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం జగవాండ్లపల్లె పంచాయితీ బోడిరెడ్డి గారిపల్లెకు చెందిన అనిల్ కుమార్ బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్య మానస(35) మరదలు గౌతమి(32)తో కలిసి కారులో స్వగ్రామం బయలుదేరారు. బెంగళూరు కార్నర్లోని బట్టరహళ్లి వద్ద పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ అడగడంతో కారులో ఎక్కించుకున్నారు. ఈ క్రమంలో వి.కోట మండలం రామాపురం వద్ద హంద్రీ–నీవా కాలువ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అనిల్ కుమార్ మరదలు గౌతమి(32) కారులో నుంచి బయట పడి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన మానసను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. అనిల్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. లిప్ట్ అడిగి ప్రయాణిస్తున్న పరంధామరెడ్డి, జ్ఞానేంద్రరెడ్డి క్షేమంగా బయటపడినట్టు సీఐ సోమశేఖర్రెడ్డి, ఎస్ఐ షేక్షావలీ తెలిపారు. అక్కాచెల్లెలు మృతదేహాలను పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


