డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం
వైఎస్సార్కు అంజలి ఘటిస్తున్న భూమన, ఆర్కే రోజా
మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ
‘‘ చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసింది. మెగా డీఎస్సీ పేరుతో అక్రమాలకు తెరతీసింది. అర్హులైన అభ్యర్థులకు ద్రోహం చేసింది. ఉద్యోగాలను అమ్ముకుని వేలాదిమందిని దగా చేసేసింది. ఇందులో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. నిరుద్యోగులను నిరాశలోకి నెట్టేసినందుకు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి. విద్యార్థుల భవితను ప్రశ్నార్థకంగా మార్చకుండా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అప్పటి వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుంది. ఉధృతంగా ఉద్యమిస్తూనే ఉంటుంది. ఈ మేరకు యువతను సమరానికి సన్నద్ధం చేస్తోంది’’ అంటూ వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు.
బహిరంగ వంచన
డీఎస్సీ విషయంలో యువతకు జరిగింది మోసం కాదు.. బహిరంగ వంచన, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుంది. ఈ నెల 10వ తేదీన యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. బాధిత అభ్యర్థులకు అండగా నిలవాలనే లక్ష్యంతో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. – భూమన కరుణాకరరెడ్డి,
వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు
చిత్తూరు కార్పొరేషన్ : మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్సార్సీపీ విశ్రమించదని, అప్పటి వరకు ఉద్యమం చేస్తూనే ఉంటోందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. మంగళవారం నగరి వైఎస్సార్సీపీ కార్యాలయంలో విద్యార్థులు, నిరుద్యోగులు, సోషల్మీడియా సభ్యులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గురువారం నుంచి ఆదివారం వరకు చేపట్టనున్న ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 10వ తేదీన నిర్వహించనున్న భారీ ర్యాలీని జయప్రదం చేసేందుకు నేతలు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.


