చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించే ప్రసక్తే లేదని డీఈఓ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ విద్యాబోధన, విద్యాసంస్థల నిర్వహణలో సమర్థత పెంచేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. పాఠశాలల పనితీరు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను స్వయంగా పరిశీలిస్తామని వెల్లడించారు. విధులకు గైర్హాజరైనా, బోధనలో అలసత్వం ప్రదర్శించినా శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విద్యాసంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. పది విద్యార్థులకు మిషన్ మార్చి–2026 అమలు చేస్తున్నామన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు.
నేటి నుంచి టెట్ పరీక్షలు
జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ వరకు ఆన్న్లైన్ విధానంలో టెట్ పరీక్షలు సాగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,510 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని, ఈ మేరకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నా రు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే జిల్లాలోని సీతమ్స్ ఇంజినీరింగ్ (చిత్తూరు), ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ (చిత్తూరు), మధర్ థెరిస్సా ఇంజినీరింగ్ (పలమనేరు), ద్రవిడ యూనివర్సిటీ (కుప్పం), కుప్పం ఇంజినీరింగ్ కళాశాల (కుప్పం)లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


