
ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న కంపెనీ పని వాతావరణం నచ్చకో.. మరింత వేతనం ఆశించో.. ప్రమోషన్ కోసమో.. ఇలా విభిన్న కారణాలతో వేరే సంస్థకు మారాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న కంపెనీ వేతనం ఇచ్చిన తేదీ రోజున లేదంటే తర్వాత రోజున ఉద్యోగులు అధికంగా రాజీనామా పత్రాలను సమర్పిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా ఉంటోందంటున్నారు. ముంబయికి చెందిన స్టార్టప్ ‘పిట్@గో జీరో’ వ్యవస్థాపకురాలు కిరణ్ షా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
‘ఉద్యోగులకు తాము చేస్తున్న కంపెనీలు నచ్చలేదంటే.. సరిగ్గా వేతనం పడే రోజున లేదా పడిన మరుసటి రోజున రాజీనామా చేస్తున్నారు. ఇది కొన్ని యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా అన్ని కంపెనీల్లో ఒకటో తేదీన జీతాలు ఇస్తారు. కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే కొన్ని యాజమాన్యాలకు చుక్కలే. తమ ఉద్యోగులు ఎక్కడ రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉంటారోననే ఆందోళన చెందుతుంటాయి. ఉద్యోగులు కూడా ఈ విషయంలో కంపెనీలకు విదేయతతో ఉండాలి. తమ డిమాండ్లు ఏమిటో ముందుగా కంపెనీతో చర్చించాలి’ అన్నారు.
ఇదీ చదవండి: 30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు
‘ఉద్యోగులు నిజంగా కంపెనీ నుంచి తప్పుకోవాలనుకుంటే హుందాగా తప్పుకోండి. తప్పా కంపెనీ వేతనం పడిన వెంటనే కొలువు నుంచి వైదొలగడం సరికాదు. అప్పటివరకు ఉద్యోగికి ఇచ్చిన బాధ్యతలు వెంటనే మరో వ్యక్తికి అసైన్ చేయాలంటే సంస్థకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పుకుండా నోటీస్ పీరియడ్ చేయాలి. జీతం వేసిన వెంటనే మీ యజమానిని భయభ్రాంతులకు గురిచేయకండి’ అని తెలిపారు.