ఇండియాకు ఎలాన్ మస్క్!.. ఎప్పుడో తెలుసా? | Will Visit India Later This Year Elon Musk Tweet | Sakshi
Sakshi News home page

ఇండియాకు ఎలాన్ మస్క్!.. ఎప్పుడో తెలుసా?

Apr 19 2025 3:03 PM | Updated on Apr 19 2025 3:47 PM

Will Visit India Later This Year Elon Musk Tweet

ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.

సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా మోదీ మస్క్‌ను కలిశారు. ఆ సమయంలో వీరిరువురు అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు.. స్థిరమైన అభివృద్ధిలో భారతీయ & అమెరికా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. అయితే ఎలాన్ మస్క్ ఇప్పటికే.. పలుమార్లు ఇండియాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. కానీ అవన్నీ వాయిదా పడ్డాయి. బహుశా ఈసారి పర్యటించే అవకాశం ఉందని, భారత్‌తో తమ బంధాన్ని బలపరచుకుంటారని తెలుస్తోంది.

ఇండియాకు టెస్లా
టెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి సంస్థ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టెస్లా షోరూమ్ల కోసం ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాలను ఎంపిక చేసినట్లు, ఉద్యోగుల నియామకాలను కూడా చేపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.

ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలోనే టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement