
దేశీయంగా మే నెలలో ప్యాసింజర్ వాహన హోల్సేల్(టోకు) విక్రయాలు స్వల్పంగా 0.8% తగ్గాయని వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో 3,44,656 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాది ఇదే మేలో 3,47,492 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తెలిపింది. మారుతీ నుంచి డీలర్లకు సరఫరాలు 1,44,002 నుంచి 1,35,962కు తగ్గాయి. ఎంఅండ్ఎం సరఫరా 43,218 నుంచి 52,431కు పెరిగాయి. హ్యుందాయ్ అమ్మకాలు 49,151 నుంచి 43,861 యూనిట్లకు తగ్గాయి.
ద్విచక్ర వాహనాల విక్రయాలు 2% వృద్ధితో 16,20,084 నుంచి 16,55,927 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో మోటార్సైకిళ్ల విక్రయాలు 10,39,156 యూనిట్లు, స్కూటర్ అమ్మకాలు 5,79,507 యూనిట్లుగా ఉన్నాయి. త్రి చక్రవాహన అమ్మకాలు 3.3% క్షీణించి 53,942 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే మేలో ఈ విక్రయాలు 55,763గా ఉన్నాయి.
ఇదీ చదవండి: తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!
‘గడిచిన ఆరునెలల్లో ఆర్బీఐ 3 సార్లు రెపోరేటు మొత్తంగా 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. సాధారాణ వర్షపాతం నమోదు అంచనాలు, వినియోగదారుల సెంటిమెంట్ బలపడటం తదితర అంశాలు వాహన విక్రయాల డిమాండ్ కొనసాగేందుకు దోహదపడ్డాయి’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.