
కృత్రిమ మేధ (ఏఐ) భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమ వృద్ధికి ఊతమిస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఓపెన్ఏఐ జనరేటివ్ ఏఐ టూల్ చాట్జీపీటీని ఉపయోగించడం వల్ల తన ఉత్పాదకత ఐదు రెట్లు పెరిగిందని మూర్తి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాలను హరించివేస్తుందన్న భయం సరికాదన్నారు. ఇది మరో రకమైన ఉద్యోగాన్ని సృష్టిస్తుందని చెప్పారు.
చాట్జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్ను చాలా మంది వినియోగిస్తున్నారు. అయితే ఏఐ చాలా ఉద్యోగాలకు సవాలుగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. కొన్ని కంపెనీలు ఏఐ సాకుతో లేఆఫ్స్ కూడా ప్రకటిస్తున్నాయనే వాదనలున్నాయి. ఈ తరుణంలో నారాయణమూర్తి తాజాగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ ఉత్పాదకతను పెంచుతుందన్నారు. తన ప్రసంగాలకు చాట్జీపీటీను వాడుతున్నట్లు చెప్పారు. అయితే ఏఐను సరైన ప్రశ్న అడగడంలోనే అసలు తెలివితేటలు ఉన్నాయని తెలిపారు.
‘భవిష్యత్తులో ఏమి జరుగుతుందంటే..ప్రోగ్రామర్లు, విశ్లేషకులు మెరుగైన, మరింత సంక్లిష్టమైన అవసరాలను తీర్చడంలో స్మార్ట్ అవుతారు. వారు పెద్ద సమస్యలను పరిష్కరిస్తారు. కాబట్టి కృత్రిమ మేధ ఐటీ పరిశ్రమ వృద్ధి రేటును ఎలా పెంచుతుందనే దాని గురించి నేను సానుకూలంగా ఉన్నాను’ అని తెలిపారు. భారత ఐటీ పరిశ్రమలో వృద్ధి, ఉద్యోగ నియామకాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: మేలో స్వల్పంగా తగ్గిన వాహన విక్రయాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతరాయం మధ్య ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇటీవల ఐటీ వ్యాపార నమూనాల్లో సమూల మార్పులు చేయాలని పిలుపునిచ్చారు. గత 30 ఏళ్లుగా ఉన్న సంప్రదాయ ఐటీ వ్యాపార నమూనాకు విఘాతం కలుగుతోందని, ఇప్పటికే ఆ మోడల్కు సమయం అయిపోయిందని హెచ్సీఎల్ టెక్ సీఈఓ విజయకుమార్ గతంలో తెలిపారు. కృత్రిమ మేధను సపోర్ట్గా ఉపయోగించి ఉత్పాదకత, నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవాలో గమనిస్తే సాఫ్ట్వేర్ పరిశ్రమ వృద్ధి వేగం పెరుగుతోందని మూర్తి అభిప్రాయపడ్డారు.