
45 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలు
న్యూఢిల్లీ: జీ20 షెర్పా పదవికి అమితాబ్ కాంత్ రాజీనామా సమర్పించారు. 1980వ బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అమితాబ్ కాంత్ 45 ఏళ్లపాటు వివిధ హోదాల్లో సుదీర్ఘకాలంపాటు సేవలు అందించిన అనంతరం చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడానికి ముందు.. 2022 జూలైలో ఆయనను జీ20 షెర్పాగా కేంద్రం నియమించింది. ‘నా కొత్త ప్రయాణం’ అంటూ లింక్డెన్లో అమితాబ్ కాంత్ (Amitabh Kant) తాజాగా ఒక పోస్ట్ చేశారు.
‘‘45 ఏళ్లపాటు ప్రభుత్వ సేవల తర్వాత కొత్త అవకాశాలను స్వీకరించి, జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. భారత వృద్ధికి, పురోగతికి ఎన్నో అభివృద్ది చర్యల దిశగా నాకు అవకాశం కల్పించడమే కాకుండా.. జీ20 షెర్పా పదవికి నేను సమర్పించిన రాజీనామాకు ఆమోదం తెలిపినందుకు భారత ప్రధానమంత్రికి ఎంతో కృతజ్ఞతలు’’ అని పోస్ట్లో రాసుకొచ్చారు. భారత జీ20 షెర్పాగా ఎన్నో బహుపాక్షిక చర్చలకు నాయకత్వం వహించడం తన కెరీర్లో ఒకానొక పెద్ద మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.
జీ20 షెర్పా బాధ్యతలకు ముందు 2016 నుంచి 2022 మధ్య నీతి ఆయోగ్ సీఈవోగా అమితాబ్ కాంత్ పనిచేయడం గమనార్హం. ఆ కాలంలో 115 వెనుకబడిన జిల్లాలను ప్రగతి పథకంలోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. అంతకుముందు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సెక్రటరీగానూ కాంత్ సేవలు అందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ చూపించిన మార్గదర్శనం, ప్రోత్సాహకానికి కాంత్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా నియంత్రణలు.. భారత్ కంపెనీల విలవిల