దేశీ కంపెనీలకు రేర్‌ తిప్పలు!  | India moves to conserve its rare earths | Sakshi
Sakshi News home page

దేశీ కంపెనీలకు రేర్‌ తిప్పలు! 

Jun 17 2025 6:33 AM | Updated on Jun 17 2025 9:32 AM

India moves to conserve its rare earths

చైనా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్స్‌ కోసం క్యూ... 

రెండు వారాల్లో రెట్టింపైన దరఖాస్తులు

న్యూఢిల్లీ: రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్స్‌ ఎగుమతులపై చైనా నియంత్రణలను కఠినతరం చేయడంతో భారతీయ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. ప్రధానంగా వాహన విడిభాగాల పరిశ్రమను ఈ అనిశ్చితి వెంటాడుతోంది. నేరుగా చైనా నుంచి రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్ల దిగుమతి కోసం లైసెన్స్‌లకు దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన రెండు వారాల్లో దేశీ కంపెనీల దరఖాస్తుల సంఖ్య రెట్టింపైనట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. 

జూన్‌ మధ్య నాటికి సుమారు 21 కంపెనీలు మీడియం, హెవీ రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ దిగుమతి పరి్మట్ల కోసం చైనా వాణిజ్య శాఖకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగుమతిదారులు కొనుగోలుదారు నుంచి ఎండ్‌–యూజర్‌ సరి్టఫికెట్‌ను తీసుకోవడం సహా అధికారిక అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ చైనా ఏప్రిల్‌ 4న ఆదేశాలు చేసిన నేపథ్యంలో వీటి ఎగుమతులకు తీవ్ర అండ్డంకులు నెలకొన్నాయి. 

ఈ రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్‌ మెటీరియల్స్‌ను ఎలాంటి ఆయుధాల ఉత్పత్తిలోనూ ఉపయోగించబోమని హామీ ఇవ్వడంతో పాటు నిర్దిష్ట డిక్లరేషన్లు ఈ సరి్టఫికెట్లో ఉంటాయి. చైనాకు దరఖాస్తు చేసిన కంపెనీల్లో బాష్‌ ఇండియా, మారెల్లి పవర్‌ట్రెయిన్‌ ఇండియా, మాహల్‌ ఎలక్ట్రిక్‌ డైవŠస్‌ ఇండియా, టీవీఎస్‌ మోటార్స్, యూనో ఇండియా తదితర దిగ్గజాలు ఉన్నాయి. విధానపరమైన కారణాలతో గతంలో తిరస్కరణకు గురైన సోనా కామ్‌స్టర్‌ తిరిగి దరఖాస్తు చేసుకుంది. చైనా ఆమోదం కోసం వేచి చూస్తోంది. 

52 కంపెనీలు... 
భారతీయ వాహన తయారీ సంస్థల సంఘం (సియామ్‌) వివరాల ప్రకారం భారతీయ ఆటోమబైల్‌ కంపెనీలకు సరఫరా చేయడం కోసం దాదాపు 52 కంపెనీలు పూర్తిగా చైనా మాగ్నెట్లపైనే ఆధారపడుతున్నాయి. వీటిలో చాలా వరకు తమ తాజా పర్మిట్ల కోసం అన్ని లాంఛనాలను పూర్తి చేసి చైనా సరఫరాదారులకు డాక్యుమెంట్లను పంపించాయి. అయితే, చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి వాటికి ఇంకా తప్పనిసరి ఎగుమతి లైసెన్స్‌ రాకపోవడంతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 

మరోపక్క, భారతీయ అధికారులు కూడా చైనాతో చర్చల కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పెద్దగా పురోగతి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, యూరోపియన్‌ సంస్థలు మాత్రం ఈ విషయంలో వేగంగా చర్యలు తీసుకున్నాయి. వాస్తవానికి యూఎస్‌ సుంకాలకు ప్రతిగా చైనా రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్లపై నిబంధనలను కఠినతరం చేయగా.. అమెరికా ప్రభుత్వం వాటి సరఫరా విషయంలో ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. యూరప్‌ వాహన విడిభాగాల తయారీ సంస్థలకు కూడా అనుమతులు లభించాయి. భారతీయ కంపెనీలు మాత్రం అనుమతుల కోసం నానాతప్పలు పడుతున్నాయి.

ఉత్పత్తికి విఘాతం... 
వీలైనంత త్వరగా లైసెన్స్‌లు దక్కకపోతే తయారీకి తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన పరిశ్రమ స్థాయితో పోలిస్తే రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్ల దిగుమతుల విలువ తక్కువే అయినప్పటికీ.. వాటిని ఉపయోగించి తయారు చేసే ఒక్క విడిభాగం లేకపోయినా వాహనాల తయారీ నిలిచిపోతుందని ఆటోమొబైల్‌ కంపెనీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు. 2024–25లో భారత్‌ రూ.306 కోట్ల విలువైన 870 టన్నలు రేర్‌ ఎర్త్‌ మాగ్నెట్లను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం కంపెనీల వద్దనున్న నిల్వలు జూన్‌ మొదటి నాటికి పూర్తిగా అయిపోతాయని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement