ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ‘ఆంథ్రోపిక్’కు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా యూఎస్ ప్రభుత్వం ‘ఎగుమతి నియంత్రణ’ ఆదేశాలను జారీ చేసింది. దీనికి స్పందించిన ఆంథ్రోపిక్ తన అధునాతన ఏఐ మోడళ్లు ‘ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లందరికీ ఈ సేవల యాక్సెస్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
అమెరికా భూభాగంలోనైనా, వెలుపలనైనా, ఏ విదేశీ పౌరుడికైనా, చివరికి ఆంథ్రోపిక్ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు సైతం ఫేబుల్ 5, మైథోస్ 5 మోడళ్ల యాక్సెస్ను పూర్తిగా నిలిపివేయాలని యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అయితే తమ ఇతర ఏఐ మోడళ్ల సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆంథ్రోపిక్ వివరణ ఇచ్చింది.
భారత్పై తీవ్ర ప్రభావం
అమెరికా తర్వాత ఆంథ్రోపిక్ సంస్థకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ కావడంతో తాజా నిర్ణయం భారతీయ క్లయింట్లు, కార్పొరేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటీవలే దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన 50 వేల మంది ఉద్యోగులకు ఆంథ్రోపిక్ ఏఐ మోడళ్లపై శిక్షణ అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్లాడ్ మోడళ్ల ఆధారంగా అధునాతన ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేసేందుకు ఫిబ్రవరిలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అలాగే సైబర్ సెక్యూరిటీ చొరవ కింద ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ ద్వారా కొన్ని భారత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ లభించింది. తాజా నిర్ణయంతో ఈ సేవలన్నీ నిలిచిపోనున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంతో విభేదిస్తున్న ఆంథ్రోపిక్
ప్రభుత్వ ఆదేశాలు జూన్ 12న సాయంత్రం 5.21 గంటలకు అందినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ‘ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’ మోడళ్లలో భద్రతా లోపాలను దారి మళ్లించే ఒక పద్ధతి బయటపడిందని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ప్రభుత్వం చెబుతున్న లోపం చాలా చిన్నదని, సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దమని మోడల్ను కోరడం లాంటి సాధారణ విషయమేనని కంపెనీ వాదిస్తోంది.
ఇలాంటి ఫీచర్లు ఓపెన్ఏఐకు చెందిన జీపీటీ–5.5తో పాటు ఇతర ఏఐ మోడళ్లలో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఒక కమర్షియల్ మోడల్ను ఇలాంటి చిన్న కారణంతో నిలిపివేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ, సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంథ్రోపిక్ వెల్లడించింది.


