భారతదేశపు అగ్రగామి ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అయిన 'టాటా పవర్', దేశంలోనే అతిపెద్ద ఫోర్ వీలర్ ఈవీ తయారీ సంస్థ 'టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్'తో జతకట్టింది. ఈ రెండు సంస్థలు కలిసి తెలంగాణలోనే మొట్టమొదటి హై-స్పీడ్ 'టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్'ను హైదరాబాద్లోని ఐలాబ్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రారంభించాయి.
హైటెక్ సిటీ నడిబొడ్డున వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఐలాబ్స్ చార్జింగ్ హబ్.. హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించింది. సొంత ఈవీ కార్లు ఉన్నవారు, కమర్షియల్ ఫ్లీట్ నిర్వాహకులు, రైడ్ హెయిలింగ్ సర్వీసులు, నగరాల మధ్య ప్రయాణించే వారు, కార్పొరేట్ ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
హైదరాబాద్ నగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అండ్ బిజినెస్ హబ్గా ఎదుగుతున్న తరుణంలో.. నమ్మకమైన, వేగవంతమైన ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల డిమాండ్ను తీర్చడంతో పాటు, రాష్ట్ర పర్యావరణ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశ్యం.
మొత్తం 360 కిలోవాట్స్ చార్జింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ మెగాచార్జర్ హబ్లో మూడు 120 కిలోవాట్ల డిస్పెన్సర్లు ఉన్నాయి. వీటి సహాయంతో ఒకే సమయంలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేయవచ్చు. 24 గంటలూ పనిచేసే ఈ సదుపాయం వల్ల చార్జింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది. అలాగే కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేని, నమ్మకమైన చార్జింగ్ అనుభూతి లభిస్తుంది. ఈ ప్రాంతంలో అత్యాధునిక ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది.


