
ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, చేర్పులు చేపట్టింది. ఇందులో భాగంగా కీర్తి గనోర్కర్ కంపెనీ ఎండీగా పదోన్నతి పొందారు. దిలీప్ సంఘ్వీ స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సంఘ్వీ కొనసాగుతారు.
నార్త్ అమెరికా విభాగం ప్రెసిడెంట్, సీఈవో అభయ్ గాంధీ తప్పుకోనుండటంతో ఆయన స్థానంలో రిచర్డ్ ఆస్క్రాఫ్ట్ చేరతారని కంపెనీ తెలిపింది. ఎంబీఏ, కెమికల్ ఇంజినీర్ అయిన గనోర్కర్ 1996 నుంచి సన్ ఫార్మాలో వివిధ విభాగాల్లో పని చేశారు. 2019 జూన్ నుంచి సన్ ఫార్మా భారత విభాగానికి గనోర్కర్ నేతృత్వం వహిస్తున్నారు.
ఆయన సారథ్యంలో వ్యాపారం, మార్కెట్ వాటా నిలకడగా పెరిగిందని సంస్థ వివరించింది. స్పెషాలిటీ విభాగాలు, జపాన్.. యూరప్ మార్కెట్లలోకి కూడా సన్ ఫార్మా విస్తరించడంలో గనోర్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది.