ఫెడ్‌ సమీక్షే మార్కెట్‌కు దిక్సూచి | Stock Market Outlook Fed Policy Review Iran US Talks Inflation Data | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ సమీక్షే మార్కెట్‌కు దిక్సూచి

Jun 15 2026 7:19 AM | Updated on Jun 15 2026 7:24 AM

Stock Market Outlook Fed Policy Review Iran US Talks Inflation Data

బలపడిన ఉపాధితో కఠిన విధానాలు

దేశ, విదేశాల గణాంకాలూ కీలకమే

ముడిచమురు, రూపాయిపై దృష్టి

ఇరాన్, యూఎస్‌ డీల్‌కు ప్రాధాన్యం

ఈ వారం ట్రేడింగ్‌పై నిపుణుల అంచనా

పలు దేశ, విదేశీ గణాంకాలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షను చేపట్టనుంది. యూఎస్, ఇరాన్‌ మధ్య డీల్‌పైనా భారీ అంచనాలున్నాయి. వెరసి ఈ అంశాల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు అప్రమత్తంగా కదిలే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.    – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

ప్రధానంగా యూఎస్, ఇరాన్‌ మధ్య ఒప్పందం కోసం ప్రపంచవ్యాప్తంగా అటు ఇన్వెస్టర్లు, ఇటు ఆర్థికవేత్తలు ఎదురుచూస్తున్నారు. మూడు నెలలుగా పలు అంశాలలో అనిశ్చితికి కారణమవుతున్న పశి్చమాసియా యుద్ధం ముగింపుపై గత వారాంతాన ఆశలు చెలరేగాయి. యుద్ధం ముగిసే ఒప్పందం కుదరనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో గత వారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కె ట్లు జోరందుకున్నాయి. హార్ముజ్, న్యూక్లియర్‌ అంశాలు ఒక కొలిక్కి వచ్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ వారం ఇరాన్, యూఎస్‌ మధ్య కుదిరే వీలున్న శాంతి ఒప్పందానికి విశ్వవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలిపారు. 

ద్రవ్యోల్బణంపై ఫోకస్‌ 
నేడు(సోమవారం) దేశీయంగా మే నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ ఏకంగా 3.88 శాతం నుంచి 8.3 శాతానికి ఎగసింది. ఇది 42 నెలల గరిష్టంకాగా.. పశి్చమాసియా సంక్షోభం ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. గత వారం విడుదలైన రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) సైతం ఆహార ధరల కారణంగా 3.93 శాతానికి పెరిగింది. ఇవి ఆర్‌బీఐ పరపతి విధానాలను ప్రభావం చేయగలవని ఆర్థికవేత్తలు తెలియజేశారు. మే నెలకు రేపు(16న) వాణిజ్య గణాంకాలు విడుదలకానున్నాయి. ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 28.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. యథాతథంగా 5.25 శాతం వద్దే రెపో రేటు కొనసాగించిన ఆర్‌బీఐ గత వారం పాలసీ వివరాలు(మినిట్స్‌) వారాంతాన(19న) వెల్లడి కానున్నాయి. 

విదేశీ అంశాలు 
మే నెలకు యూఎస్‌ వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు అంచనాలను మించుతూ 1,72,000గా నమోదైంది. దీంతో నిరుద్యోగ రేటు 4.3% వద్దే  ఉంది. ఇది ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల స్టేటస్‌ కో నిర్ణయాలను సమరి్థస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. గత పాలసీ సమావేశంలో ఫెడ్‌ 3.5–3.75% వద్ద ఫండ్స్‌ రేట్లను నిలిపి ఉంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం(17న) ఫెడ్‌ పరపతి సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి.

సాంకేతికంగా చూస్తే.. 
గత వారం ప్రధాన ఇండెక్సులు బలాన్ని పుంజుకోవడం ద్వారా పరిమిత కన్సాలిడేషన్‌ నుంచి సాంకేతికంగా బయటపడ్డాయి. దీంతో ఈ వారం నిఫ్టీ వెనువెంటనే 23,800 పాయింట్లను తాకవచ్చు. ఈ స్థాయిలో ఎదురయ్యే రెసిస్టెన్స్‌ని అధిగమిస్తే 24,000–24,200వరకూ పుంజుకునే వీలుంది. మరోపక్క 23,450– 23,350 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించవచ్చు.

గత వారమిలా 
ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,285 పాయింట్లు(1.75 శాతం) ఎగసి 75,528 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 256 పాయింట్లు(1.1 శాతం) పుంజుకుని 23,623 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 0.3% నీరసించగా.. , స్మాల్‌ క్యాప్‌ 0.2% లాభపడింది.

ఎఫ్‌పీఐ అమ్మకాల స్పీడ్‌ 
ఈ నెల 15 రోజుల్లో రూ. 62,853 కోట్లు 
దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెల తొలి రెండు వారాల్లో రూ. 62,853 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. పశి్చమాసియా సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, డాలరుతో మారకంలో రూపాయి క్షీణత తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌ వివరాల ప్రకారం దేశీ స్టాక్స్‌ నుంచి ఎఫ్‌పీఐలు 2026లో ఇప్పటివరకూ రూ. 2.87 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. తద్వారా 2025 కేలండర్‌ ఏడాదిలో నమోదైన రూ. 1.66 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను దాటేశాయి. 2026లో ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్‌పీఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తూ వస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement