జాగ్రత్త.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు: ట్రంప్‌ | Spains Ceuta Migrant Crisis Sparks Trump Warning | Sakshi
Sakshi News home page

జాగ్రత్త.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు: ట్రంప్‌

Aug 1 2026 6:45 AM | Updated on Aug 1 2026 6:48 AM

Spains Ceuta Migrant Crisis Sparks Trump Warning

ఒకవైపు స్పెయిన్‌ సరిహద్దులో వేలాది మంది వలసదారుల ప్రవాహం.. మరోవైపు అమెరికా సరిహద్దులపై రాజకీయ చర్చ. స్పెయిన్‌లోని సియుటా ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ వలస సంక్షోభాన్ని ఉదాహరణగా చూపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అక్రమ వలసల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. యూరప్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు భవిష్యత్‌లో అమెరికాలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

“ఆ దృశ్యాన్ని గుర్తుంచుకోండి. తప్పు విధానాలు కొనసాగితే మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు” అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. స్పెయిన్‌లోని సియుటా(Ceuta)లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. సరిహద్దుల రక్షణ, అక్రమ వలసల నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని ఆయన అన్నారు.

అమెరికా వలసలపై ట్రంప్‌ ఆందోళన
అక్రమ వలసల నియంత్రణ ట్రంప్‌ రాజకీయ అజెండాలో మొదటి నుంచీ కీలక అంశంగా ఉంది. అమెరికా–మెక్సికో సరిహద్దు నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు ప్రవేశించడంపై ఆయన గతంలోనూ తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయాలని, అక్రమంగా వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పదేపదే డిమాండ్‌ చేశారు.

స్పెయిన్‌ సరిహద్దులో జరిగిన ఘటనను కూడా ట్రంప్‌ ఇదే వాదనకు ఉదాహరణగా చూపించారు. నియంత్రణ లేని వలసలు ఏ దేశానికైనా సామాజిక, భద్రతా సమస్యలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అసలేం జరిగింది?
ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో నుంచి స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం సియుటాలోకి గత రెండు రోజులుగా వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. యూరప్‌లోకి చేరేందుకు ప్రయత్నించే వలసదారులకు సియుటా కీలక మార్గంగా మారింది.

గురువారం నుంచి సరిహద్దు వద్ద పరిస్థితులు తీవ్రంగా మారాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కంచెలు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొందరు సముద్ర మార్గంలో ఈదుకుంటూ స్పెయిన్‌ భూభాగంలోకి చేరేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో జరిగిన ప్రమాదాల్లో కనీసం 57 మంది మృతి చెందినట్లు సియుటా ప్రాంత అధ్యక్షుడు జువాన్‌ జీసస్‌ వివాస్‌ వెల్లడించారు. కొందరు సముద్రంలో మునిగి చనిపోగా, మరికొందరు సరిహద్దు కంచె వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

24 గంటల్లోనే 60 వేల మంది?
సియుటా ప్రాంతంలోకి గత 24 గంటల్లోనే దాదాపు 60 వేల మంది ప్రవేశించినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. అయితే స్పెయిన్‌ అంతర్గత మంత్రిత్వ శాఖ మాత్రం గురువారం నుంచి సుమారు 50 వేల మంది సరిహద్దు దాటినట్లు అంచనా వేసింది. వీరిలో చాలా మందిని తిరిగి మొరాకోకు పంపించినట్లు స్పెయిన్‌ అధికారులు తెలిపారు. 48 వేల మందికి పైగా ఇప్పటికే మొరాకోకు తిరిగి వెళ్లిపోయారని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరికొందరు కూడా గంటల వ్యవధిలో వెనక్కి వెళ్తున్నారని పేర్కొంది.

ఎందుకు ఒక్కసారిగా పెరిగింది వలసల ప్రవాహం?
సియుటా వైపు ఇంత భారీ సంఖ్యలో వలసదారులు రావడానికి ప్రధాన కారణం.. యూరప్‌లోకి ప్రవేశించే అవకాశంగా ఈ మార్గాన్ని భావించడమే. ఆఫ్రికాలోని పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, మెరుగైన జీవితం కోసం చేసే ప్రయత్నాలు అనేక మందిని యూరప్‌ వైపు నడిపిస్తున్నాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సరిహద్దు దాటే ప్రయత్నం జరగడం అసాధారణమని అధికారులు చెబుతున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలు కూడా వలసదారులను ప్రేరేపిస్తున్నాయని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఆరోపించారు.

స్పెయిన్‌ చర్యలు.. యూరప్‌లో ఆందోళన
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్‌ అదనపు భద్రతా బలగాలను సియుటాకు పంపింది. సైన్యం, పోలీసులు, డ్రోన్లు, సముద్ర భద్రతా బృందాలను రంగంలోకి దించింది. ఈ ఉదంతంపై యూరోపియన్‌ యూనియన్‌(EU) కూడా స్పందించింది. యూరప్‌ నిబంధనలను పాటించకుండా ఎవరినీ అనుమతించబోమని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ స్పష్టం చేశారు.

స్పెయిన్‌లోని సియుటా సంక్షోభం ఇప్పుడు కేవలం ఆ దేశ సమస్యగా కాకుండా.. యూరప్‌ సరిహద్దు భద్రత, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వలసల సమస్యపై మరోసారి చర్చకు దారితీసింది. ట్రంప్‌ వ్యాఖ్యలతో ఈ అంశం అమెరికా రాజకీయాల్లోనూ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement