టీమ్‌ సీతారామన్‌... బడ్జెట్‌ మే ‘సవాల్‌’! | Special Story About Finance Minister Nirmala Sitharaman budget team | Sakshi
Sakshi News home page

టీమ్‌ సీతారామన్‌... బడ్జెట్‌ మే ‘సవాల్‌’!

Jan 31 2025 6:17 AM | Updated on Jan 31 2025 1:48 PM

Special Story About Finance Minister Nirmala Sitharaman budget team

దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది... ఒకపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.4 శాతానికి తగ్గుతుందని స్వయంగా ప్రభుత్వ అంచనాలే చెబుతున్నాయి. ప్రజల వినిమయం తగ్గిపోవడం, ప్రైవేటు పెట్టుబడుల్లో స్తబ్దత, భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు మోదీ సర్కారుకు కత్తిమీద సాముగా మారాయి. రూపాయి పాతాళానికి నిచ్చెనేసినట్లు జారిపోతోంది. తాజాగా డాలర్‌తో దేశీ కరెన్సీ మారకం విలువ 86.7 జీవిత కాల కనిష్టానికి క్రాష్‌ అయ్యింది. 

మరోపక్క, అమెరికా ఆధ్యక్ష పీఠమెక్కిన ట్రంప్‌... చాలా దేశాలతో పాటు మన మెడపైనా సుంకాల కత్తి పెట్టడంతో టారిఫ్‌ వార్‌ 2.0కు తెరలేచింది. దీంతో మన ఎగుమతులకు గడ్డుకాలం తప్పేలా లేదు. ఇంటాబయటా ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రికార్డు స్థాయిలో వరుసగా ఎనిమిదోసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.50 లక్షల కోట్లకు మించిన బడ్జెట్‌ను రెడీ చేశారు. ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పకుండానే ప్రగతిని పట్టాలెక్కించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఈ నేపథ్యంలో 140 కోట్లకు పైగా దేశ ప్రజల కోసం సీతారామన్‌ అండ్‌ టీమ్‌ తయారు చేసిన ఈ బడ్జెట్‌ నలభీమ పాకాన్ని అలుపెరగకుండా వండివార్చిన ఉద్ధండ అధికారుల సంగతేంటో చూద్దాం...

ఎం. నాగరాజు
ఆర్థిక సేవల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1993 బ్యాచ్‌ త్రిపుర కేడర్‌ ఐఏఎస్‌ అధికారి ఆయన. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితుల పెంపు వంటి సంస్కరణలకు రోడ్‌మ్యాప్‌ రూపొందించడం, అంతకంతకూ పెరుగుతున్న సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట వేయడం, బ్యాంకింగ్‌ రంగానికి మరింత ఆర్థిక జవసత్వాలను అందించడంపై బడ్జెట్లో ఫోకస్‌ చేశారు.

తుహిన్‌ కాంత పాండే 
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో అత్యంత సీనియర్‌ అధికారి. ఆర్థిక, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2019లో దీపమ్‌ (పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం) కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి దేశ బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. 1987 బ్యాచ్‌ ఒడిశా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన పాండే గతేడాది సెప్టెంబర్‌లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. దీపమ్‌ సెక్రటరీగా ఎయిరిండియా ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల డివిడెండ్‌ పాలసీ వంటి కీలక చర్యలు చేపట్టి దమ్మున్న అధికారిగా పేరు దక్కించుకున్నారు. దీపమ్‌ సెక్రటరీగా రాకముందు ఆయన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో పని చేయడంతో పాటు ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూఎన్‌ఐడీఓ)  ప్రాంతీయ కార్యాలయంలో కూడా సేవలందించారు.  

వి. అనంత నాగేశ్వరన్‌
2022లో ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా నియమితులయ్యారు. మోదీ 3.0లోనూ కొనసాగుతుండటం ఆయన దీక్షాదక్షతలకు నిదర్శనం. 2025–26 కేంద్ర బడ్జెట్‌కు ముందు వరుసగా మూడోసారి ఆర్థిక సర్వేను రూపొందించారు. ఆర్థికాంశాల బోధనతో పాటు క్రెడిట్‌ సూసే గ్రూప్‌ ఏజీ, జూలియస్‌ బేయర్‌ గ్రూప్‌ వంటి దిగ్గజ సంస్థల్లో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌గా కూడా గతంలో పనిచేశారు. నేడు పార్లమెంట్‌కు సమరి్పంచనున్న ఆర్థిక సర్వేలో నాగేశ్వరన్‌ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులను కళ్లకు కట్టడంతో పాటు 2047 నాటికి వికశిత భారత్‌ (అభివృద్ధి చెందిన దేశం)గా నిలిపేందుకు అవసరమైన కీలక సూచనలను కూడా పొందుపరిచడానికి తీవ్రంగా శ్రమించారు.  

అజయ్‌ సేథ్‌ 
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. 2021 నుంచి నాలుగు దఫాలుగా బడ్జెట్‌ రూపకల్పన జట్టులో కీలకంగా వ్యవహరించారు. ఆర్థిక శాఖలో రెండో సీనియర్‌ అధికారిగా ఆయన నేతృత్వంలోనే వివిధ విభాగాలను సమన్వయం చేసుకుంటూ మొత్తం బడ్జెట్‌ ప్రక్రియకు చుక్కానిగా నిలుస్తున్నారు. ఆయన సారథ్యంలో బడ్జెట్‌ విభాగం ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, రుణ సమీకరణ మధ్య సమతూకంతో బ్యాలెన్స్‌ షీట్‌కు తుదిమెరుగులు దిద్దింది. భారతదేశంలో తొలి సార్వ¿ౌమ గ్రీన్‌ బాండ్స్‌ జారీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ సెక్రటేరియట్‌ ఏర్పాటు వంటి సాహసోపేతమైన చర్యల అమలు ఘనత సేథ్‌ సొంతం. ద్రవ్యలోటును ప్రభుత్వ లక్ష్యమైన 4.5 శాతం దిగువన కట్టడి చేస్తూ ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయడంతో పాటు జీడీపీతో పోలిస్తే ప్రభుత్వ రుణ నిష్పత్తి విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయడం రానున్న బడ్జెట్లో ఆయన ప్రధాన అజెండాగా మారింది.

మనోజ్‌ గోవిల్‌
1991 బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన గోవిల్‌... మోదీ 3.0లో 2024 ఆగస్టులో కేంద్ర వ్యయ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో మొదటిసారి భాగస్వామ్యం వహిస్తున్నారు. రూపాయి ఘోరంగా పడిపోతున్న తరుణంలో బడ్జెట్లో సబ్సిడీలకు సంబంధించి అంచనాలు, కేటాయింపుల వంటి కఠిన వ్యవహరాలపై కఠోరంగా శ్రమించారు.

అరుణీశ్‌ చావ్లా 
దీపమ్, ప్రభత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) కార్యదర్శిగా 2024 డిసెంబర్లో చార్జ్‌ తీసుకున్నారు. 1992 బ్యాచ్‌ బిహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన చావ్లా ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, డాక్టరేట్‌ పొందిన చావ్లాకు 2014 నుంచి వ్యయాల విభాగం జాయింట్‌ సెక్రటరీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ, పీఎస్‌యూలకు చెందిన నిరుపయోగ ఆస్తుల విక్రయం, పీఎస్‌యూల కార్యకపాలాలను గాడిలో పెట్టి, మరింత బలోపేతం చేయడం వంటి వాటిపై బడ్జెట్లో ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement