రాజధాని అప్పులు రాష్ట్ర ప్రజల పైనే! | Debt payments from the state treasury | Sakshi
Sakshi News home page

రాజధాని అప్పులు రాష్ట్ర ప్రజల పైనే!

Jul 30 2026 4:45 AM | Updated on Jul 30 2026 4:45 AM

Debt payments from the state treasury

రాజధాని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని ఊదరగొట్టిన చంద్రబాబు

దాని భారం ప్రజలపై పడదని పదేపదే వెల్లడి

ఇప్పుడు మెల్లగా రాష్ట్ర ఖజానా నుంచి అప్పుల చెల్లింపులు

రెండో త్రైమాసికంలో చెల్లించాల్సిన అప్పులకు రూ.231.40 కోట్లు

గడువు తీరుతున్న అప్పులు చెల్లింపునకే ఈ నిధులు వినియోగమని సన్నాయినొక్కులు

ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్‌ శాఖ

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సెల్ఫ్‌ ఫైనా­న్స్‌ ప్రాజెక్టు అని, దాని నిర్మాణానికి అయ్యే ఖర్చు భారం రాష్ట్ర ప్రజలపై పడదని సీఎం చంద్రబాబు, ఇతర కూటమి నేతలు పదే పదే చెబుతూ వచ్చారు. కేంద్రం ఇప్పించిన రుణాల భారమూ రాష్ట్రంపై పడ­దని నమ్మబలికారు. తీరా చూస్తే అప్పులను మెల్లగా రాష్ట్ర ఖజానా నుంచే చెల్లించడం ప్రారంభించారు. రాజధాని పేరుతో చేసిన అప్పులు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. 

ఈ  ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో చెల్లించాల్సిన అప్పుల కోసం బడ్జెట్‌ నుంచి రూ.231.40 కోట్లను విడుదల చేస్తూ మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్‌ కుమార్‌ బుధవారం ఉత్త­ర్వులు జారీ చేశారు. గడువు తీరు­తున్న అప్పుల చెల్లింపునకే ఈ నిధులను వినియో­గించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఆర్‌­డీఏ కమిషనర్‌ వినతి మేరకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాజధాని అమ­రావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అంటూ గొప్ప­లు చెబుతూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరి రాజధాని పేరుతో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు బడ్జెట్‌ నుంచి నిధులు ఎందుకు విడుదల చేస్తు­న్నారో చెప్పాల్సి ఉందని అధికార­వర్గాలే వ్యాఖ్యాని­స్తున్నాయి. 

రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు, హడ్కో, జర్మ­నీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ, ఎన్‌ఏబీ­ఎఫ్‌­ఐడీ, ఏపీపీఎఫ్‌సీఎల్, నాబార్డు నుంచి రూ.47,387 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. అప్పులు చేసినా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అయినందున అప్పు­లను ఆ ప్రాజెక్టే తీరుస్తుందనే రీతిలో సీఎం చంద్ర­బాబు చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గడువు తీరుతున్న అప్పులను తిరిగి చెల్లించేందుకు రూ.231.40 కోట్లను బడ్జెట్‌ నుంచి విడుదల చేయడం గమనా­ర్హం. 

ఈ నిధులు విడుదలతో పాటు షరతులను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులను సీఆర్‌డీఏ ప్రతిపాదనల్లో సూచించిన రుణ బాధ్య­తల చెల్లింపునకు మాత్రమే ఉపయోగించాలని, మరే ఇతర ప్రయోజనానికి వినియోగించరాదని షరతు విధించారు. అన్ని తిరిగి చెల్లింపులు రుణ ఒప్పందాలు, గడవు తేదీల ప్రకారం కచ్చితంగా జరగాలని, వాటిని నిర్ధారించాలని చెప్పారు. నిధుల వినియోగం జరిగిన వెంటనే, రుణాల వారీగా చెల్లింపుల వివరాలతో పాటు వినియోగ ధ్రువీకరణ పత్రాన్ని పరిపాలన, ఆర్థిక విభాగాలకు సమర్పించాలని, సంబంధిత శాఖ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement