
మూడు దశాబ్దాలకుపైగా ప్రయాణంలో భారత ఐటీ రంగానికి దన్ను
సాఫ్ట్వేర్ ఎగుమతుల వృద్ధితోపాటు స్టార్టప్ వాతావరణం వేగవంతం
దేశవ్యాప్తంగా 67 కేంద్రాలు, ద్వితీయశ్రేణి పట్టణాలపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ, ఏపీలో ఐదు చోట్ల ఉపకేంద్రాలు
హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలో రూ. 1.42 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు
1.35 లక్షల చదరపు అడుగుల వర్క్స్పేస్, 134 స్టార్టప్ల ఇంక్యుబేషన్
సాక్షి, హైదరాబాద్: భారత్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాతావరణాన్ని బలోపేతం చేయడంతో ద్వారా దేశ ‘డిజిటల్ సాధికారత’కలకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా మూలస్తంభంగా నిలుస్తోంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం (1991లో) ఏర్పాటైన ఎస్టీపీఐ దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో వృద్ధి, సాంకేతిక స్టార్టప్ల వాతావరణాన్ని వేగవంతం చేయడంలో కీలకంగా పనిచేస్తోంది. ఎస్టీపీఐ ఇటీవలే 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కోవలోనే ఏర్పాటైన ఎస్టీపీఐ హైదరాబాద్ విభాగం తెలంగాణ, ఏపీలో ఐటీ, స్టార్టప్ రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 1.35 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్తో భారత ఐటీ పరిశ్రమను ఎస్టీపీఐ హైదరాబాద్ బలోపేతం చేస్తోంది.
రూ. 4.76 కోట్ల ఎగుమతులతో..
దేశవ్యాప్తంగా ఎస్టీపీఐకి 14 చోట్ల డైరెక్టరేట్లు ఉండగా హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. ఇరు రాష్ట్రాల్లోని కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్లో కలుపుకొని మొత్తం ఐదు కేంద్రాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్, ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యంగా ఎగుమతుల యూనిట్లు (ఈఓయూ), తయారీ జోన్లు (ఈపీజెడ్)లను ఎస్టీపీఐ ఏర్పాటు చేసింది. 2023–24లో రూ. 1.23 లక్షల కోట్లు, 2024–25లో రూ. 1.42 లక్షల కోట్ల ఐటీ ఎగుమతుల ద్వారా హైదరాబాద్ ఎస్టీపీఐ భారత ఆర్థిక వృద్ధిలో కీలకంగా మారింది. 1992–93లో రూ. 4.76 కోట్ల ఐటీ ఎగుమతుల ద్వారా హైదరాబాద్ ఎస్టీపీఐ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఇక్కడ ‘ఇమేజ్ ’.. అక్కడ ‘కల్పతరు’
ఐటీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎస్టీపీఐ హైదరాబాద్ కొత్తగా ‘ఇమేజ్’, ‘కల్పతరు’ను ఏర్పాటు చేసింది. గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ విజన్, ఏఐ స్టార్టప్లకు అవసరమైన మార్గదర్శనం, సాంకేతిక మద్దతు, నిధుల సమీకరణ తదితరాల కోసం 2020లో హైదరాబాద్ ఇమేజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఇందులో సీవీ ల్యాబ్, గేమ్ ల్యాబ్తోపాటు స్టార్టప్లకు అవసరమైన పలు సమీకృత కార్యక్రమాలు చేపట్టింది. అలాగే విశాఖపట్నంలో ‘కల్పతరు’పేరిట సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ను స్థాపించారు. ఆవిష్కర్తలకు అవసరమైన మౌలిక వసతులు, నిధులు, మార్కెటింగ్ తదితరాలను కల్పతరు ద్వారా అందుబాటులోకి తెచ్చారు.
ఐటీ ఊతానికి ఎస్టీపీఐలు
దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో 1991లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)కు శ్రీకారం చుట్టారు. ఐటీ సంస్థలకు అవసరమైన డేటా కమ్యూనికేషన్ సౌకర్యాలు, కంప్యూటర్లు, కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ఎస్టీపీఐకి అప్పగించారు. మరోవైపు సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించడం, మార్కెటింగ్లో మద్దతు, ప్రాజెక్టులకు అనుమతులు, ఎగుమతులకు అవసరమయ్యే సర్టిఫికేషన్ తదితరాలన్నీ ఒకేచోట అందుబాటులోకి తెచ్చారు. తొలుత బెంగళూరు, పుణే, భువనేశ్వర్లో ఎస్టీపీయూ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయగా ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, నోయిడా, గాందీనగర్, త్రివేండ్రం తదితర చోట్లకు విస్తరించారు.

ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల వైపు
దేశంలో ఐటీ రంగం శైశవ దశలో ఉన్న కాలంలో మూడు కేంద్రాలతో ప్రారంభమైన ఎస్టీపీఐ ప్రస్తుతం 67 కేంద్రాలకు కార్యకలాపాలను విస్తరించింది. అందులో 59 కేంద్రాలు ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయి. ఎస్టీపీఐలో నమోదైన ఐటీ పరిశ్రమల ద్వారా గతేడాది ఐటీ ఎగుమతులు రూ. 10 లక్షల కోట్లకు చేరాయి. దేశంలోని 24 ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఆంట్రప్రెన్యూర్షిప్ (సీఓఈ)ల ద్వారా 1,400 స్టార్టప్లకు మద్దతు లభించింది. వాటికోసం ఇప్పటివరకు రూ. 574 కోట్ల నిధులను సేకరించింది. దేశ డిజిటల్, ఆవిష్కరణల వాతావరణానికి ఎస్టీపీఐ మూల స్తంభంగా నిలుస్తోంది. హైదరాబాద్ ఎస్టీపీఐ పరిధిలోనూ ‘ఇమేజ్’, ‘కల్పతరు’ద్వారా 134 స్టార్టప్లకు ప్రోత్సాహాన్ని అందించింది.
– అర్వింద్ కుమార్, డైరెక్టర్ జనరల్, ఎస్టీపీఐ