పీఎస్‌యూల డీలిస్టింగ్‌ సరళతరం | SEBI approved framework for the voluntary delisting of PSUs | Sakshi
Sakshi News home page

పీఎస్‌యూల డీలిస్టింగ్‌ సరళతరం

Jun 19 2025 8:58 AM | Updated on Jun 19 2025 9:47 AM

SEBI approved framework for the voluntary delisting of PSUs

నిబంధనలను సడలించనున్న సెబీ

ఎన్‌ఎస్‌ఈఎల్‌ స్టాక్‌ బ్రోకర్ల కోసం స్కీము

బోర్డ్‌ మీటింగ్‌లో నిర్ణయాలు 

ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛందంగా డీలిస్ట్‌ అయ్యేందుకు వెసులుబాటు కల్పించేలా నిబంధనలను సడలించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రమోటర్‌ షేర్‌హోల్డింగ్‌ 90 శాతానికి చేరితేనే డీలిస్టింగ్‌ విజయవంతమైనట్లవుతుంది. దీని కోసం షేరు కనీస ధరను 60 రోజుల సగటు రేటు, గత 26 వారాల్లో గరిష్ట ధర తదితర అంశాల ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. అయితే, బుక్‌ వేల్యూ తక్కువగా ఉన్నా లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గానీ మార్కెట్‌లో రేటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధానంతో డీలిస్టింగ్‌ ప్రక్రియ పీఎస్‌యూలకు చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.

ఈ నేపథ్యంలోనే 90 శాతం పైగా ప్రభుత్వ వాటాలున్న పీఎస్‌యూల స్వచ్ఛంద డీలిస్టింగ్‌కి సంబంధించి కనీస ధరను లెక్కించే విధానాన్ని, మూడింట రెండొంతుల మంది పబ్లిక్‌ షేర్‌హోల్డర్లు ఆమోదం తెలపాలన్న నిబంధనను సడలించాలని సెబీ భావిస్తోంది. మరోవైపు, కేవలం భారతీయ ప్రభుత్వ బాండ్లలోనే ఇన్వెస్ట్‌ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) పాటించాల్సిన నిబంధనలను సడలించాలని చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే సారథ్యంలో జరిగిన రెండో బోర్డు మీటింగ్‌లో నిర్ణయించింది.  

స్టార్టప్‌ వ్యవస్థాపకులకు ఊరట..

పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లాలనుకునే అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ఊరటనిచ్చే ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఐపీవో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడానికి కనీసం ఒక్క ఏడాది ముందు కేటాయించిన ఎసాప్స్‌ను (ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్లు) వారు అట్టే పెట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవోకెళ్లే సమయంలో ఎసాప్స్‌ సహా ఇతరత్రా షేర్ల కేటాయింపు రూపంలో ప్రయోజనాలేవీ అంకురాల ప్రమోటర్ల వద్ద ఉండకూడదు. ఒకవేళ ఉంటే, వాటిని ఐపీవోకి ముందుగానే విక్రయించాలి.

ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’

విదేశాల నుంచి భారత్‌కు తమ ప్రధాన కార్యాలయాన్ని మార్చుకోవాలనుకుంటున్న సంస్థలకు తాజా సడలింపు ఉపయోగపడనుంది. అటు ఎన్‌ఎస్‌ఈఎల్‌ పేమెంట్‌ సంక్షోభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలు ఎదుర్కొన్న నిర్దిష్ట స్టాక్‌ బ్రోకర్ల కోసం సెటిల్మెంట్‌ స్కీమును ప్రవేశపెట్టినట్లు సెబీ తెలిపింది. ఈ స్కీమును ఎంచుకోవడం ద్వారా తమపై ఉన్న పెండింగ్‌ కేసులను పరిష్కరించుకునేందుకు వారికి వీలుంటుంది. ఇక, ఐపీవో పత్రాల ఫైలింగ్‌కు ముందు కీలక మేనేజ్‌మెంట్‌ సిబ్బంది, ప్రస్తుత ఉద్యోగులు, డైరెక్టర్లు దగ్గర షేర్లు డీమ్యాట్‌ రూపంలో ఉండాలనే ప్రతిపాదనకు కూడా సెబీ ఆమోదముద్ర వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement