
ఇండస్ ఇండ్, జెన్సోల్ ఖాతాల సమీక్ష
ఐసీఏఐ ప్రెసిడెంట్ నందా
మోసాలతో సంక్షోభం బారిన పడిన ఇండస్ఇండ్ బ్యాంక్, జెన్సోల్ ఇంజినీరింగ్ ఆర్థిక నివేదికల పూర్తిస్థాయి పరిశీలనకు, ఆడిట్ పరమైన లోపాలు ఉన్నాయా? అన్నది నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత మండలి ఐసీఏఐ ప్రకటించింది. ఇప్పటికే ఐసీఏఐకు చెందిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డ్ (ఎఫ్ఆర్ఆర్బీ) ఈ రెండు సంస్థల ఆర్థిక నివేదికల సమీక్షను ప్రారంభించిందని, ఇందులో గుర్తించిన వాస్తవాల ఆధారంగా, అవసరమైతే ఆడిటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.
ఇదీ చదవండి: భారత ఆటబొమ్మల నాణ్యత భేష్
‘ఖాతాల్లో అసలు ఏమి జరిగిందన్నది తెలుసుకోవడానికి కనీసం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువే సమయం తీసుకోవచ్చు’ అని ఐసీఏఐ ప్రెసిడెంట్ చరణ్జిత్ సింగ్ నందా తెలిపారు. ఇండస్ఇండ్ బ్యాంక్, జెన్సోల్ ఇంజినీరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో వాస్తవాలు, పారదర్శకత లేదని ఎఫ్ఆర్ఆర్బీ గుర్తించినట్టయితే, అప్పుడు ఐసీఏఐ క్రమశిక్షణ చర్యల కమిటీ ముందుకు ఈ అంశం వెళుతుందని చెప్పారు. జెన్సోల్ ఇంజినీరింగ్ ఖాతాల నుంచి నిధులు మళ్లించినట్టు సెబీ దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. ఇండస్ఇండ్ బ్యాంక్ డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో రూ.1,979 కోట్ల మేర ఖాతాల్లో లోపాలున్నట్టు, స్వయంగా బ్యాంకు వెల్లడించడం గమనార్హం.